రూ.2 వేల నోట్లలో సగం వెనక్కి వచ్చాయి

మార్కెట్‌లో చ‌లామ‌ణిలో ఉన్న రూ. 2000 నోట్ల‌లో స‌గం నోట్లు తిరిగి వ‌చ్చాయ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ చెప్పారు. బ్యాంకుల‌కు తిరిగివ‌చ్చిన రూ. 2000 నోట్ల విలువ రూ. 1.82 ల‌క్ష‌ల కోట్లుగా న‌మోదైంది.  ఇక బ్యాంకుల‌కు తిరిగివ‌చ్చిన 2000 రూపాయ‌ల నోట్ల‌లో 85 శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో రాగా, మిగిలినవి నోట్ల మార్పిడి జ‌రిగింద‌ని శ‌క్తికాంత దాస్ పేర్కొన్నారు. 
ఇప్పటివరకు వెనక్కి వచ్చిన ఈ 50శాతం నోట్ల విలువ రూ.1.82 లక్షల కోట్లని వెల్లడించారు. మార్చి 31 నాటికి రూ.2 వేల నోట్లు రూ.3.62 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు.  అయితే సెప్టెంబర్ 30 వరకు చివరి తేది ఉన్నందున చివరి సమయంలో నోట్లు డిపాజిట్ లేదా మార్చుకోవడం చేయొద్దని సూచించారు.
చివరి సమయంలో రద్దీని తగ్గించేందుకు ప్రజలు ముందుగానే 2వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు తగ్గట్టుగా సెంట్రల్ బ్యాంకు కరెన్సీ కలిగి వుందని  శక్తికాంత్ దాస్ తెలిపారు. కాగా.. ఉపసంహరణకు ముందే చెలామణిలో ఉన్న 2వేల నోట్ల సంఖ్య గణనీయంగా 46 శాతం తగ్గిందని శక్తికాంత్ దాస్ తెలిపారు.
2018 మార్చి 31 వరకు మొత్తం 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చెలామణిలో ఉండగా..3.62 లక్షల కోట్లకు తగ్గింది. మార్చి నెలలో చెలామణిలో ఉన్న నోట్లు కేవలం 10.8 శాతం మాత్రమేనని శక్తికాంత్ దాస్ తెలిపారు.  రూ. 500 నోట్ల‌ను ఉప‌సంహ‌రించ‌డం లేదా రూ. 1000 నోట్ల‌ను తిరిగి ప్ర‌వేశ‌పెట్టే దిశ‌గా ఎలాంటి ఆలోచ‌న చేయ‌డం లేదని ఆయన స్పష్టం చేశారు. పెద్ద నోట్ల‌పై ప్ర‌జ‌లకు ఎలాంటి ఊహాగానాలు అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.