గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అయిన ముఖ్తార్ అన్సారీకి 1991నాటి అవదేశ్ రాయ్ హత్య కేసులో వారణాసి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అవదేశ్ రాయ్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ సోదరుడు. ఆయనని లాహురాబీర్ ఇంటి గేటు వద్ద 1991 ఆగస్టు 3న కాల్చి చంపారు. ముఖ్తార్ అన్సారీ, ఇతరులపై కేసు నమోదయింది. ముఖ్తార్కు హత్య కేసులో జీవిత ఖైదు పడినట్లు వారణాసి కోర్టు బయట న్యాయవాది తెలిపారు.
ఈ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ ప్రతిస్పందిస్తూ ‘ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నదానికి ఇది ముగింపు. నేను, నా తల్లిదండ్రులు, అవదేశ్ కూతురు, మొత్తం కుటుంబం ఓపికతో ఎదురుచూశాము’ అని చెప్పారు. `ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి, ముఖ్తార్ మాత్రం మరింత బలవంతుడయ్యాడు. అయినా మేము వదిలిపెట్టలేదు. న్యాయవాదుల పనితీరుతో నేడు కోర్టు అతడిని నేరస్థుడిగా నిర్ధారించింది’ అని పేర్కొన్నారు. ఇదే కేసులో ముక్తార్ అన్సారీపై లక్ష జరిమానా వేశారు.
అన్సారీపై 61 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను దోషిగా తేలడం ఇది అయిదోసారి. అతనిపై మరో 20 కేసులు విచారణ కోసం పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల ఏప్రిల్లోనే ఓ కిడ్నాప్-మర్డర్ కేసులో అతనికి పదేళ్ల జైలు శిక్ష పడింది. లాయర్ల కథనం ప్రకారం 1991 ఆగస్టు 3న అజయ్ రాయ్, ఆయన సోదరుడు ఇంటి గేటు ముందు నిల్చుని ఉండగా, అన్సారీ సహా కొందరు దుండగులు కారులో వచ్చి అవదేశ్ను కాల్చి చంపారు.
ఆ తర్వాత అజయ్ రాయ్ తన లైసెన్డ్డ్ పిస్టల్తో ఎదురు కాల్పులు జరుపగా ఆగంతకులు పారిపోయారు. పోతూ పోతూ వారి కారు వదిలి పారిపోయారు. ఆ తర్వాత అవదేశ్ను కబీర్చౌరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ డాక్టర్లు ఆయన అప్పటికే చనిపోయినట్టు తెలిపారు.
మౌ సదర్ సీటు నుంచి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన అన్సారీ 2022 ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఆయన సీటు నుంచి ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీ సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ టికెట్పైన గెలిచారు. ఆ పార్టీ సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది.
More Stories
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం