రైతు సంక్షేమంలో కేసీఆర్ సైంధవుని పాత్ర

నరేంద్ర మోదీ   ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే వాటిని తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషిస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీధర్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల అవలంబిస్తూ రైతుల ఉసురుతీస్తున్నదని మండిపడ్డారు.
 
 భౌగోళిక విస్తీర్ణం కోణంలో దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు నరేంద్ర మోదీ  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల అతివృష్టితో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే అవకాశాన్ని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర రైతులకు అందకుండా మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ కుమ్మక్కై నిలువునా ముంచిందని విమర్శించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తర్వాతనే ప్రగతి భవన్ నుండి కెసిఆర్ పొలంబాట పట్టాడని చెప్పారు.
 
 ప్రగతి భవన్ లో నిద్రపోతున్న కేసీఆర్ ను పొలాల్లోకి రప్పించిన ఘనత కిసాన్ మోర్చా దే అని స్పష్టం చేశారు. 2018 లో తిరిగే అధికారంలోకి రావడానికి రైతులకు లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని ఆ మాటే మరిచిన కేసీఆర్ కు రైతులు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తగురీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
 
తెలంగాణలో రెవెన్యూ సంస్కరణల పేరుతో ధరణి పోర్టల్ని ప్రవేశపెట్టి రైతులకు మానసిక వేదన మిగిల్చారని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్ లో లోపాలను సరిదిద్దకపోతే కిసాన్ మోర్చా రైతుల పక్షాన ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.  బిజెపి కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్,డి పాపయ్య గౌడ్ ,  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి  తదితరులు కూడా ప్రసంగించారు.