నేషనల్ హెరాల్డ్ కేసులో అంజన్ కుమార్‌కు ఈడీ నోటీసులు

కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మే 31న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఈడీ అధికారులు అంజన్ కుమార్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు.

గతేడాది నవంబర్ 23న ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు అంజన్ కుమార్ గతంలో రూ. 20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ విరాళంపైనే ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలను కూడా ఈడీ విచారించింది. తాజాగా మరోసారి ఈడీ విచారణకు రావాలంటూ అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

నేషనల్ హెరాల్డ్ అనేది ఒక న్యూస్ పేపర్. దీనిని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించారు. కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి 1937లో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఈ న్యూస్ పేపర్‌ను పబ్లిష్ చేసింది. ఆ గ్రూపులో సుమారు ఐదు వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేర్ హోల్డర్లుగా ఉండేవారు. అతి తక్కువ కాలంలోనే నేషనల్ హెరాల్డ్ పేపర్ ఒక జాతీయవాద పత్రికగా పేరు పొందింది.

అయితే దాదాపు 70 ఏళ్ల పాటు ఈ పత్రిక సంచికలు వెలువరించగా, ఆర్థిక కారణాలతో 2008లో పేపర్ ముద్రణ నిలిచిపోయింది. కానీ 2016 నుంచి డిజిటల్ పబ్లికేషన్ ప్రారంభమైంది. అయితే నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు పైనాన్షియల్ ఇబ్బందులు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సొమ్మును ఆ పత్రికకు అప్పుగా ఇచ్చింది.

ఏ‌జేఎల్‌కి పార్టీ ఎప్పటికప్పుడు వడ్డీ లేని రుణం ఇచ్చింది. అలా పలు ధపాలుగా రూ. 90 కోట్లు అందించినా, 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2010లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ (ఎజిఎల్)ను టేకోవర్ చేసుకుంది.

ఇందులో మెజారిటీ షేర్ హోల్టర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాగా, మిగిలిన షేర్లు కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌వి ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు 2012లో బీజేపీ అగ్రనేత సుబ్రమణ్య స్వామి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు పెట్టారు.

వారు వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని పేర్కొంటూ స్వామి 2012 నవంబర్‌లో ఢిల్లీలోని కోర్టులో ఫిర్యాదు చేశారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఢిల్లీ, యూపీతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ. 1,600 కోట్ల రూపాయల విలువైన ఏజెఎల్ ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు గతేడాది పలు మార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. తాజాగా అంజన్ కుమార్ యాదవ్‌ను మరోసారి ఈడీ విచారణకు పిలవటంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.