కవిత షెల్ కంపెనీల నుంచి రూ.80 కోట్లు బదిలీ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు ఇంకా వెంటాడుతున్నాయి.  జైలు నుండే ఈ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు చేస్తూ వరుసగా లేఖలను తన న్యాయవాది ద్వారా విడుదల చేస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ఇప్పుడు మరోలేఖలో ఆమె ఏకంగా రూ 80 కోట్లు బదిలీ చేసినట్లు ఆరోపించారు.
 
 ఐదు పేజీల ఈ లేఖలో కవిత, అరవింద్ కేజ్రీవాల్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు చేశాడు. కవిత  షెల్ కంపెనీల ఖాతాల నుంచి రూ.80 కోట్ల నిధులు మళ్లించినట్లు బాంబు పేల్చాడు. ఈ నిధులను మారిషస్‌కు మళ్లించినట్లు ఆరోపించాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాడు.
 
ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు చెందిన గ్రీన్ హస్క్ కంపెనీలకు రూ.80 కోట్లు తరలించినట్లు సుఖేష్ తెలిపాడు. కైలాష్ గెహ్లాట్ బంధువుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు చెప్పాడు. 25+25+30 కోట్లు నగదు బదిలీలు జరిగాయని, నగదు బదిలీలపై కేజ్రీవాల్ చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తానని వెల్లడించాడు.
 
వాస్తవాలను బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని, తమకు అనుకూలమైన జైలు అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించాడు. వేధింపులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు.
 
ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేష్ చంద్రశేఖర్ పలు ఆరోపణలు చేశాడు. కేజ్రీవాల్ ఇంటి ఫర్నిచర్ ఖర్చులను తానే భరించానని, ఫర్నిచర్ బిల్లులు తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. త్వరలో కేజ్రీవాల్‌కు సంబంధించిన మరో కుంభకోణాన్ని బయటపెడతానని చెప్పాడు.
 
కేజ్రీవాల్ ఫేస్‌టైమ్ చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను విడుదల చేస్తానని పేర్కొంటూ కేజ్రీవాల్ సూచనలతోనే తాను రూ.80 కోట్లు బదిలీ చేసినట్లు సుఖేష్ చెప్పాడు. నగదును యూఎస్‌బీటీ, క్రిప్టో కరెన్సీకి మార్చబడిందని, కేజ్రీవాల్ సూచనతోనే అబుదాబికి నగదు పంపారని సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖ ద్వారా చెప్పుకొచ్చాడు.

గతంలోనూ ఈ కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి రెండు లేఖలను సుఖేష్ విడుదల చేశాడు. కవితతో తాను వాట్సప్‌లో ఛాట్ చేసిన స్క్రీన్‌షాట్లను కూడా బయటపెట్టాడు. ఈ వాట్సప్ ఛాట్‌లో నిధుల లావాదేవీలకు సంబంధించి కోడ్ భాషలో కవిత, సుఖేష్ మాట్లాడుకున్నారు.

 
అయితే, సుఖేష్ వ్యాఖ్యలను కవిత ఖండిస్తూ వస్తున్నారు. అతడెవరో తనకు అసలు తెలియదని, వాట్సప్ ఛాట్‌లు ఫేక్ అని చెప్పారు. కాగా లిక్కర్ స్కాంలో కవిత ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణకు హాజరయ్యారు. కవిత ఫోన్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు పలు ఛార్జ్ షీట్ లలో పేర్కొన్నాయి.