అవినాష్ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం కోర్టు

మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపి అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అవినాష్‌కు మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.  సిబిఐ అరెస్ట్‌, విచారణ నుంచి వారంరోజుల పాటు మినహాయింపు ఇవ్వాలన్న అవినాష్‌ విజ్ఞప్తిని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.

ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణపై సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎంపి అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పై ఈనెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వీలైనంత వరకు అదేరోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని సూచించింది.

మరోవైపు విచారణ సందర్భంగా… సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు లాయర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని పక్షాలు వెకేషన్‌ బెంచ్‌ ముందే వాదనలు వినిపించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

‘వచ్చే నెల 6న తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ విచారణకు వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశించండి. లేదంటే ఈ నెల 25న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారించాలని ఆదేశించి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులివ్వండి’ అంటూ తన పిటీషన్ లో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును  అభ్యర్థించారు.

 
వైఎస్ సునీతా రెడ్డి లాయర్లు కోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము కేసు మెరిట్స్‌లోపలికి వెళ్లడం లేదని వ్యాఖ్యానించింది. ఏదైనా చెప్పదలుచుకుంటే ఉంటే హైకోర్టు ముందుకెళ్లాలని సూచించింది. ఈ హత్య కేసు దర్యాప్తును ట్రయల్‌ కోర్టు పర్యవేక్షించవచ్చా.. లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌ను ఆయన దరఖాస్తుతో కోర్టు జత చేసింది.