బెంగళూరు వరదలకు రూ. 2 కోట్ల బంగారం నగలు గల్లంతు

బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి.  బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి.

ఈ వరదలకు ఓ బంగారం దుకాణంలో నీరు చేరి బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి. ఈ వరదల కారణంగా మల్లీశ్వర్‌ ప్రాంతంలోని ఓ నగల దుకాణం పెద్దమొత్తంలో నష్టపోయింది. ఆ ప్రాంతంలోని తొమ్మిదవ క్రాస్‌లో ఉన్న నిహాన్‌ జ్యువెల్లరీ అనే నగల దుకాణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

దీంతో షాపులో ఉన్న రూ.కోట్ల విలువైన బంగారు నగలు  వరదలో కొట్టుకుపోయినట్లు దుకాణం యజమాని ప్రియ తెలిపారు. దుకాణం సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులే ఈ వరదలకు కారణమని ఆమె ఆరోపించారు. చెత్తా చెదారంతో కొట్టుకువచ్చిన నీటిలో 80 శాతానికి పైగా నగలు నీటిపాలయ్యాయి. వాటి విలువ దాదాపు రూ. 2 కోట్లు ఉంటుందని దుకాణ యజమాని బోరుమంటున్నారు. అధికారులకు ఫోన్​ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘షాపులోని బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి. మున్సిపల్‌ అధికారులకు ఫోన్‌చేసి సాయం కోరినా వారు స్పందించలేదు. దుకాణంలోని 80 శాతం నగలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుంది’ అని దుకాణం యజమాని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ అధికారులకు ఫోన్‌చేసినా స్పందించలేదని ఆమె మండిపడ్డారు. బెంగళూరు విధానసౌధ, కార్పొరేషన్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, జయనగర్, ఆనంద్ రావు, మెజెస్టిక్, రేస్ కోర్స్, కేఆర్ సర్కిల్, టౌన్ హాల్,  మల్లీశ్వర్ సహా పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు, మురుగు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. సుమారు 400కి పైగా చెట్లు నేలకూలాయి. వీటిని తొలగించేందుకు కార్మికులు నానా తంటాలు పడుతున్నారు.

పలు ప్రధాన రహదారులు గుంతల మయంగా మారాయి. వర్షం కారణంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 600కు పైగా ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.