మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

రాష్ట్రం తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటోన్న దశలో మణిపూర్‌ లో మరోసారి ఘర్షణలు సోమవారం చెలరేగాయి. ఇంఫాల్‌లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి. అలాగే మంటల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.

సంఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అధికారులు ఆర్మీ, అసోం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే, అతని ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తాజాగా ఓ స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్‌ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం  భద్రతా బలగాలను మోహరించింది. మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించింది.

హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఏప్రిల్ నెలలో ఆందోళనలు కొనసాగడంతో రాష్ర్టంలో భద్రతా బలగాలను మోహరింప చేశారు. మణిపూర్‌ లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం అని అంటున్నారు.

రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనుల(ఎస్టీ) హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉధృతం చేశాయి. అవి నిర్వహించిన సంఘీభావ యాత్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది.  కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఆ ఘటనల్లో దాదాపు 70 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.

ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులను మోహరించి, కొద్దిరోజుల తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కానీ,  మళ్లీ అక్కడి వాతావరణం మొదటికొచ్చేలా కనిపిస్తోంది. ఇంతకుముందు మణిపూర్‌ లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్‌పుర్‌ ఈ ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పాల్గొనాల్సిన సభావేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేశారు.