భాగ్యనగర్ ఉగ్ర కుట్ర కేసులో జిమ్ ట్రైనర్ కోసం వేట

భాగ్యనగర్ ఉగ్ర కుట్ర కేసులో హిజ్బ్ ఉత్ తహ్రీర్ కేసులో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. హైదరాబాద్‌లో అరెస్టైన రాడికల్ ఇస్లామిక్ (హెచ్‌యూటి) ఉగ్రవాదుల విచారణలో పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు. హైదరాబాద్‌లో దాడులు చేసేందుకు సలీం, సల్మాన్ కీలకంగా వ్యవహరించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.

ఈ ఇద్దరు నింది తులు మెహిదీపట్నంలోని పిస్టల్ షూటింగ్ సెంటర్‌లో వారం పాటు శిక్షణ తీసుకున్నట్లు గుర్తించారు. సెంటర్ నిర్వాహకులు ఆధార్, ఇతర చిరునామా వివరాలు అడగడంతో అక్కడ శిక్షణ మానేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.  కాగా, నిందితులకు జిమ్ ట్రైనర్ యాసిర్ నుండి ఆదేశాలు వచ్చిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు అతని కోసం ఏటీఎస్ అన్వేషిస్తున్నది.

అనంతరం ఆత్మరక్షణ పేరుతో ముస్లిం యువతకు దేహ దారుఢ్యంపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. దీని ద్వారా యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని విచారణలో తేలింది. ఓయూలోని ఓ మైదానంతో పాటు శామీర్ పేట్ లోని నిర్మానుష్య ప్రాంతాల్లోనూ యువతకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నిందితులు అందరూ ఏడాదిన్నర కాలం నుంచి ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఇంటెలిజెన్స్ బృందం గుర్తించింది. అలాగే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ శివారులో నిందితులు శిక్షణ పొందినట్టుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్ పుర, బోజ్పుర శివారు నీమేడా గ్రామంలో శిక్షణ పొందారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయని సమాచారం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం కోసం నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా విచారణ చేస్తున్నాయి. నిందితులు ఉపయోగించిన కోడ్ భాషపై దర్యాప్తు సంస్థ లు ఆరా తీస్తున్నాయి. బిర్యానీ, లడ్డూ వంటి కోడ్ భాషలపై దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. నిందితులు ఉపయోగించిన ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. మొబైల్ లో డేటాను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డ్యామ్‌లు, స్టేడియాల్లో నిందితులు విధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తు ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నాయి.