మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జపాన్, అస్ట్రేలియా , పాపువా న్యూగునియా దేశాల్లో పర్యటించనున్నారు ప్రధాని. ఆరు రోజూల పాటు మోదీ పర్యటన కొనసాగుతుంది.

జీ-7 సమ్మిట్ లో పాల్గొనేందుకు తాను జపాన్ కు బయలుదేరినట్టుగా మోదీ పేర్కొన్నారు. జపాన్ ఆహ్వానం మేరకు హిరోషిమాకు ఇవాళ వెళ్లారు. జపాన్ ప్రధానమంత్రి కిషిదా ఇటీవల భారత్ పర్యటనకు  వచ్చారు. కిషిదా భారత్ పర్యటన నుండి తిరిగి జపాన్ కు వెళ్లిన తర్వాత ఆయనను మళ్లీ కలుసుకొనేందుకు వెళ్లడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఏం చేయాలనే దానిపై జీ 7 సమ్మిట్ లో చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన భాగస్వామ్య ప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకోవడం కోసం తాను ఎదురుచూస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. జపాన్ లోని హిరోషిమాలో జరిగే జీ 7 సమ్మిట్ లో పాల్గొనే ఆయా దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు.

జపాన్ నుండి మోదీ పాపువా న్యూ గినియాలో పోర్ట్ మోర్సీని సందర్శిస్తారు. ఇంతవరకు భారత్ ప్రధాని ఎవరూ కూడా న్యూగినియాను సందర్శించలేదు. న్యూగినియాను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే కానున్నారు.

న్యూగినియా ప్రధానితో కలిసి ఈ నెల 22న ఫోరమ్ ఫర్ ఇండియా ఫసిఫిక్ ఐలాండ్ కో ఆపరేటివ్ 3వ, సమ్మిట్ ను మోదీ ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ లో 14 ఫసిఫిక్ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.  వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఆ తర్వాత ప్రధాని మోదీ  అస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. అస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఆహ్వానం మేరకు మోదీ  ఆ దేశ పర్యటనకు వెళ్తారు. భారత్ , అస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్టుగా మోదీ పేర్కొన్నారు. అస్ట్రేలియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలు, నాయకులతో పాటు ఎన్ఆర్ఐలతో చర్చించనున్నట్టుగా ప్రధాని తెలిపారు.