ప్రధాని మోదీ – ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భేటీ

జీ7 సదస్సులో భాగంగా హిరోషిమాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత ఇరువురు నేతలు వ్యక్తిగతంగా కలవడం ఇదే తొలిసారి.ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ జీ7 సమ్మిట్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో శనివారం హిరోషిమా చేరుకుంటారు.

ప్రధాని నరేంద్ర మోదీ  అంతకుమునుపే హిరోషిమాకు బయలుదేరి అక్కడ జి7 లీడర్స్ తో సమావేశమవుతారు. దాంతో పాటు క్వాడ్ నాయకత్వ సదస్సులోనూ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 2022లో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా న్యూఢిల్లీకి వెళ్లి ఉక్రెయిన్ ‘శాంతి ప్రణాళిక’కు మద్దతు ఇవ్వాలని భారత్‌ను కోరారు.  తూర్పు ఐరోపా ప్రాంతంలో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించడం వంటి విషయాల్లో అనేక సందర్భాల్లో రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది.

ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఒకసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. 2022 సెప్టెంబరులో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) పక్షాన జరిగిన వారి సమావేశంలో, మోదీ  పుతిన్‌తో ఇది “యుద్ధ యుగం కాదు” అని చెప్పారు. దీనిపై అప్పట్లో ప్రపంచ నాయకులు సైతం స్పందించారు.

మే 19 నుంచి మే 21 వరకు జపాన్ లో జీ-7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఇప్పటికే వివిధ దేశాల అధ్యక్షులు జపాన్ చేరుకోగా,  ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం జపాన్ బయల్దేరి వెళ్లారు. మే 20, మే 21 తేదీలలో జరగనున్న రెండు అధికారిక సెషన్లలో మోదీ పాల్గొననున్నారు. మొదటి సెషన్ ఆహారం, అభివృద్ధి, ఆరోగ్యం, లింగ సమానత్వంపై ఉంటుంది. రెండవ సెషన్ వాతావరణం, శక్తి, పర్యావరణంపై అనే అంశాలపై ఉంటుంది. ఈ సెషన్‌లో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతతో పాటు ప్రపంచ సవాళ్లపై మోడీ ప్రసంగించనున్నారు.

పాక్ యే సానుకూల వాతావరణం సృష్టించాలి

పొరుగుదేశమైన పాకిస్థాన్ తో `సాధారణ, పొరుగుదేశ’ సంబంధాలను భారత దేశం కోరుకొంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే, అందుకు అనువైన ఉగ్రవాదం, ప్రతికూలత లేని వాతావరణాన్ని సురించవలసిన బాధ్యత పాకిస్థాన్ దే  అని స్పష్టం చేశారు. జపాన్ పర్యటన సందర్భంగా ఆ దేశపు పత్రిక నిక్ఖేయి ఆసియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  అందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఆ దేశంపైననే ఉందని తేల్చి చెప్పారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ భారత్ ఎప్పుడు శాంతివైపు ఉంటుందని, ఈ విషయంలో స్థిరంగా ఉంటుందని తెలిపారు. “తమ నిత్యావసరాలు సమకూర్చుకునే విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, ముఖ్యంగా ఆహరం, ఇంధనం, ఎరువులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి మా మద్దతు ఉంటుంది. మేము ఉక్రెయిన్, రష్యా – రెండు దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము” అని భారతదేశం విధానం గురించి వివరించారు.

చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి, సామరస్యం ముఖ్యమని ప్రధాని చెప్పారు. భవిష్యత్ లో భారత్ – చైనా సంబంధాల అభివృద్ధి పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు, పరస్పర సున్నితత్వంలపై ఆధారపడి ఉంటాయని మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేర్చుకోవడం ఈ మొత్తం ప్రాంతానికే కాకుండా ప్రపంచానికే ప్రయోజనకరం కాగలదని తెలిపారు.