తెలంగాణలో రజాకార్ల రాజ్యం పోయి, రామరాజ్యం రావాలి

తెలంగాణలో రజాకార్ల రాజ్యం పోయి, రామరాజ్యం రావాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పిలుపిచ్చారు. కరీంనగర్ లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటూ  బీజేపీ ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిందని వివరిస్తూ ‘‘పదేళ్ల క్రితం అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతుందని ఎవరైనా అనుకున్నారా? ఈ సంవత్సరం రామ మందిరం ప్రారంభం కాబోతోంది. ఆర్టికల్‌ 370 రద్దు కూడా బీజేపీతోనే సాధ్యమైంది” అని గుర్తు చేశారు.
 
తెలంగాణలోనూ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను పోగొట్ నాగరికతను తీసుకువస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ ఆర్థికంగా, వైజ్ఞానికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో విశ్వగురువు కాబోతోందని సెహెబుతూ తెలంగాణలో కూడా రామరాజ్యం ఏర్పడనుందని భరోసా వ్యక్తం చేశారు.  బీజేపీ పాలిత అసోంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నామని, తెలంగాణలో మాత్రం 10వ తేదీ వరకు కూడా వేతనాలందడం లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ అభివృద్ధిని మరిచి, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఇరుకున్నారని గుర్తుచేశారు. మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని.. కేసీఆర్‌కు ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఒవైసీ ఇక్కడ ఉగ్రవాదిని తన కాలేజీలో హెచ్‌వోడీగా నియమించారని, మదర్సాలను ఏర్పాటు చేసి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. అసోంలో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదంతో సంబంధాలున్న 600 మదర్సాలను మూసివేవామని, మరో 300 మదర్సాలను బంద్‌ చేస్తామని వెల్లడించారు.

‘‘మా రాష్ట్రంలో ఆరు వేల మదర్సాలను బంద్ చేయించాం. దీంతో ఒవైసీ నా సంగతి చూస్తానని బెదిరించారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా. ఒవైసీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా. ఆయన ఇంటికి కూడా వస్తా. ఏం చేస్తాడో చూస్తా” అని సవాల్ విసిరారు. అలాగే దేశంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురాబోతున్నామని హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం అవుతుందని చెప్పారు. లవ్ జిహాద్‌‌ను అరికట్టేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం పేరు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు” అని ఆరోపించారు.  హిందువులంతా కేరళ స్టోరీ చూడాలని, హిందూ యువతులను ఉగ్రవాదులుగా ఎలా మారుస్తున్నారో అందులో చూపించారని తెలిపారు.

తెలంగాణలో రజాకార్ల, బకాసురుల రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హిందువులను సంఘటితం చేసేందుకు వినాయక ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ నిర్వహించినట్లే.. తెలంగాణలో హిందువులను సంఘటితం చేసేందుకు హిందూ ఏక్తా యాత్ర చేపట్టామని చెప్పారు.

కర్ణాటకలో బిజెపి ఓటమిని గురించి ప్రస్తావిస్తూ ఒక్క రాష్ట్రంలో బీజేపీ గెలవకపోతే ఏమైతదని, 15కుపైగా రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు. 15 నిమిషాలు టైమిస్తే మనల్ని చంపుతానన్న వాళ్లను రోడ్లమీద ఉరికించడానికి ఇంకా 5 నెలలే టైం ఉందని స్పష్టం చేశారు.

“హిందుత్వం అనేది లేకపోతే ఈ దేశం ముక్కలయ్యేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గాన్ అయ్యేది. హిందుత్వం లేకుండా భారత్ లేదు” అని హెచ్చరించారు. నిన్నగాక మొన్న ఎంఐఎం లీడర్ల మెడికల్ కాలేజీలో ఓ ఉగ్రవాదిని హెచ్ఓడీగా నియమించుకున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించాలని ప్రజలను సంజయ్ కోరారు.

 అట్లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపిచ్చారు. ట్రిపుల్ తలాఖ్‌‌ను రద్దు చేసి ముస్లిం మహిళల కోసం మోదీ  మంచి నిర్ణయం తీసుకుంటే ఎంఐఎం నాయకులు ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియెట్‌‌లో నల్లపోచమ్మ గుడికి రెండున్నర గుంటలే స్థలం ఇచ్చారని, 80 శాతం జనాభా ఉన్న హిందువుల వాటా సచివాలయంలో రెండున్నర గుంటలేనా అని ప్రశ్నించారు. సచివాలయం హిందువులదేనని.. నల్ల పోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంగా మార్చే అవకాశం తమకివ్వాలని కోరారు.