మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో అరెస్టైన డెక్కన్ కాలేజీ ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం టెర్రర్ మాడ్యుల్లో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. ఇతడే మిగిలిన వారిని ఉచ్చులోకి లాగినట్లు గుర్తించారు. భోపాల్లో చిక్కిన 11 మందితో పాటు నగరంలో అరెస్టు అయిన ఐదుగురినీ ఏటీఎస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.
మహ్మద్ సలీంగా మారిన సౌరభ్ రాజ్ విద్య 2018లో తన భార్యతో కలిసి నగరానికి వచ్చాడు. తొలుత సైదాబాద్లో నివసించిన వీళ్లు అక్కడి ఓ పాఠశాలలో టీచర్లుగా పనిచేశారు. కేవలం ఉగ్రవాద కార్యకలాపాల కోసం మాడ్యుల్ తయారు చేయడానికే హైదరాబాద్ చేరుకున్నట్లు ఏటీఎస్ చెప్తోంది.
సైదాబాద్ నుంచి సలీం తరచూ మలక్పేటలోని ప్రార్థన స్థలానికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి హఫీజ్ బాబానగర్కు చెందిన మహ్మద్ అబ్బాస్ అలీతో పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. పేదరికంలో ఉన్న అబ్బాస్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి సలీం అతడి అవసరాలు తెలుసుకుని ఆటో ఖరీదు చేసి, తక్కువ రేటుకు అతడికి అద్దెకు ఇచ్చాడు.
తన మీద ఆధారపడిన అబ్బాస్ను తన ఇంటికి పిలిచి రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, ఆడియోలు వినిపించాడు. ఈ క్రమంలో సలీంతో కలిసి పనిచేయడానికి అబ్బాస్ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. నగరంలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో క్లౌడ్ సర్విస్ ఇంజనీర్గా పని చేస్తున్న అబ్దుల్ రెహ్మాన్తో పాటు అతని భార్య కూడా మతం మార్చుకుంది.
రెహ్మాన్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వాడు కాగా, అతడి భార్య మధ్యప్రదేశ్ చెందిన వారు. రెహ్మాన్ భార్యకు, సలీం భార్యకు భోపాల్ నుంచి పరిచయం ఉంది. రెహ్మాన్ తన భార్య ద్వారా సలీం భార్యకు, ఆమె ద్వారా సలీంకు పరిచయమయ్యాడు. తరచూ సలీం ఇంటికి వచ్చి వెళ్లే రెహ్మాన్ మెల్లగా అతడి ఉచ్చులో పడ్డాడని చెబుతున్నారు.
గోల్కొండలో సలీంకు డెంటిస్ట్ షేక్ జునైద్తోపాటు దినసరి కూలీ మహ్మద్ హమీద్తో పరిచయమైంది. వీరినీ తన దారిలోకి తెచ్చుకున్న సలీం మరికొందరిని తన మాడ్యుల్లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని హమీద్కు చెప్పడంతో అతని ద్వారా చిన్ననాటి స్నేహితుడైన జవహర్నగర్కు చెందిన మహ్మద్ సల్మాన్ను పరిచయం చేశాడు.
ఈ మాడ్యుల్కు ఇప్పటివరకు వేరే ఎవరి నుంచీ ఆర్థిక సాయం అందలేదని ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చంతా సలీం, రెహ్మాన్, జునైద్ భరించారని ఏటీఎస్ గుర్తించింది. ఏడాది కాలంలో ఇతడు నాలుగు ఇళ్లు మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సలీం సైదాబాద్ నుంచి అక్బర్బాగ్, అక్కడ నుంచి సీతాఫల్మండి.. ఆపై గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చాడు. రెహ్మాన్, జునైద్ కూడా ఇతడి ప్రోద్బలంతోనే అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు.
More Stories
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
కర్ణాటకకు కుదిపేస్తున్న రేవణ్ణ సెక్స్ వీడియోలు