బంగ్లా, మయన్మార్‌లను వణికిస్తోన్న మోచ తుఫాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్‌ బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటిన సమయంలో గంటలకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పశ్చిమ మయన్మార్ తీరంలో 3.6 మీటర్ల(12 అడుగుల) లోతు సముద్రపు నీటిలో చిక్కుకున్న 1000 మంది వ్యక్తులను మే 15న రక్షకులు ఖాళీ చేయించారు.
శక్తిమంతమైన మోచా తుఫాను వందలాది మందిని గాయపరిచింది. ఆసియా ఖండంలో అత్యల్ప అభివృద్ధి చెందిన దేశమైన మయన్మార్‌లో వందలాది మంది గాయపడ్డారు. కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేశారు. నష్టం ఎంత, మృతుల సంఖ్య ఎంత అనేది తెలియదు. సముద్రంలో 8-12 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడ్డాయి.
భారీ గాలులతో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలకు రెండు దేశాలు అల్లాడిపోతున్నాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాను కారణంగా మయన్మార్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
బలమైన గాలులు వల్ల సుమారు 20000 మంది వ్యక్తులలో 700 మందికిపైగా గాయపడ్డారని, వారంతా సిట్వే టౌన్‌షిఫ్‌లోని ఎత్తైన ప్రదేశాలలో మఠాలు, పగోడాలు, పాఠశాలల్లో ఆశ్రయం పొందారని సిట్వేలోని రాఖైన్ యూత్ ఫిలాంత్రోపిక్ అసోసియేషన్ నాయకుడు తెలిపారు. ఆయన తన పేరు వెల్లడించడానికి నిరాకరించారు. సైనిక పాలనలో ఉన్న అధికారులు ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన తన భయాన్ని వ్యక్తం చేశారు. మయన్మార్‌లోని 10 లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చేరింది.
మోచా తుఫాను మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో నేలను తాకింది. ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు తుఫాను నేలను తాకింది. వరద నీరు వెనక్కి వెళ్లలేదు. చాలా మంది ప్రజలు ఇండ్ల కప్పులు, ఎత్తైన ప్రదేశాలలోనే కూర్చున్నారు. రాత్రంతా ఈదురు గాలలు వీచాయి. ఇప్పటికీ 1.5 మీటర్ల(5 అడుగుల) వరద నీరు నిలిచే ఉంది.  ఈదురు గాలులకు చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విత్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు దేశాల్లో కలిపి సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్‌కు తుఫాను ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు.  మరోవైపు భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో తీరప్రాంతాల సమీపంలోని విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు.
బంగ్లాదేశ్‌లో ప్రజల కోసం 1,500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్‌ ఎదుర్కొంటున్న అత్యంత శక్తిమంతమైన తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  అంతకుముందు.. 2007లో వచ్చిన తుఫాను ధాటికి బంగ్లాదేశ్‌లో సుమారు 3 వేల మందికిపైగా మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.