తెలంగాణలో 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరణ

తెలంగాణ రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ 2021-22 (రబీ), 2022-23 (ఖరీఫ్) పంట కాలాలకు సంబంధించి మొత్తం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరణకు, లక్ష్యానికి తగినట్లుగా మిగిలిన బియ్యాన్ని రా రైస్ రూపంలో నిర్ధేశించిన గడువులోపు ఎఫ్‌సీఐకు అందజేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు.
 
2021-22 రబీ పంట కాలానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్‌ను తెలంగాణ రైతుల నుంచి సేకరించేలా అనుమతివ్వాలని గత నెల తాను రాసిన లేఖపై వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ఆ మేరకు స్పందించినట్లు తెలిపారు.

అంతేకాక తెలంగాణ రైతులను దృష్టిలో ఉంచుకుని 2021-22 రబీ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి బియ్యం అందించటానికి ఉన్న గడువును ఇప్పటికే పలుమార్లు పెంచినప్పటికీ ఫలితం లేదని, చివరగా మరో అవకాశం ఇవ్వమని తాను చేసిన విజ్ఞప్తి మేరకు గడువును ఈనెల 31కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి చెప్పారు. కనీస మద్దతు ధర చెల్లించి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం అత్యధిక మొత్తంలో బియ్యాన్ని సేకరిస్తోందని చెప్పారు.

పెరుగుతున్న సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని పదే పదే చెబుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గడువు పెంచినా, గత సంవత్సరం రబీ పంట కాలానికి సంబంధించిన బియ్యాన్ని ఈ సంవత్సరం రబీ పంటకాలం పూర్తయినా అందించలేకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

వీటికితోడు అక్కడక్కడ కొంతమంది మిల్లర్లు అడ్డదారిన సప్లై చేస్తున్న రీసైకిల్డ్ బియ్యాన్ని అరికట్టడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. కనీసం ఇకనైనా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమయానికి ధాన్యాన్ని సేకరించి, అందుకు తగినట్టుగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకుని, రీసైకిల్డ్ బియ్యం సరఫరాను అరికట్టి ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి సకాలంలో బియ్యాన్ని అందించడంలో నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించుకొని రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కిషన్‌రెడ్డి తెలంగాణ సర్కారుకు సూచించారు.