తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న గోదావరి జల వివాదం

గోదావరి నీటిలభ్యతపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. జల లభ్యత పంపకాలపై రెండు రాష్ట్రాలు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయని కేంద్ర జలసంఘానికి గోదావరి యాజమాన్యం బోర్డు లేఖ రాసింది. గోదావరి నదిలో రెండురాష్ట్రాలు నీటి లభ్యతకంటే అధికంగా వినియోగించుకుంటున్నాయని జీఆర్‌ఎంబీ లేఖలో పేర్కొంది.
 
నీటిలభ్యతపై రెండురాష్ట్రాల మధ్య అంగీకారం లేదని జీఆర్‌ఎంబీ పేర్కొనడంపట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేస్తుందనీ, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీడబ్ల్యూసీకి రాసిన లేఖ మేరకు గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కింద 1,486,155 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ వాదిస్తోందనీ లేఖలో పేర్కొంది.

తెలంగాణలో వినియోగంలో ఉన్న, ప్రతిపాదించిన ప్రాజెక్టులకు 967 టీఎంసీలు అవసరముందనీ, మరోవైపు నదిలో 1,360 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ వాదిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొంది.  ఈ నేపథ్యంలో తెలంగాణ పంపిన సీతమ్మసాగర్‌, సీతామసాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ లను పరిశీలించాలని గోదావరి బోర్డు గతవారం రోజులక్రితం సీడబ్ల్యూసీ కి లేఖ రాసింది.

గోదావరి నీటి లభ్యత 1486,15 టీఎంసీలనీ దీనిని ఆధారంగా తీసుకుని తెలంగాణ నీటి వాటాను తేల్చాల్సి ఉందని లేఖలో పేర్కొంది.  అలాగే 75 శాతం నీటి లభ్యత కింద సీతారామ ఎత్తిపోతల వద్ద 347.06 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ డీపీఆర్‌ లో పేర్కొంది. అయితే సీతారామ ఎత్తిపోతల వల్ల దిగువన ప్రాజెక్టులపై ప్రభావాన్ని కేంద్ర జలసంఘం పరిశీలించాలని గోదావరి బోర్డు లేఖలో పేర్కొంది.

మరోవంక, తెంలగాణ నీటి లభ్యత లేకున్నా గోదావరిపై ప్రాజెక్టులను కడుతుందని ఏపీ చేసిన ఫిర్యాదును కూడా గోదావరి నదీ యాజమాన్య బోర్డు లేఖలో జతపరిచింది. ఈ నేపథ్యంలో గోదావరి జలాలపై ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉన్న వివాదాలు ఇప్పుడు సీడబ్ల్యూ సీ ముందుకు వెళ్లిన్నట్లయింది.