క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా తాయ్‌లాండ్‌లో క్యాసినో నిర్వహించిన ఘటనపై ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. చికోటితో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవందర్ రెడ్డి, సంపత్, మాధవ రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది.

సంపత్ ఇప్పటికే విచారణకు హాజరు కాగా, మిగితా ముగ్గురు విచారణకు హాజరు కావాల్సి ఉంది. థాయ్‌లాండ్‌ నుంచి మే12న చికోటి ప్రవీణ్ హైదరాబాద్ కు రానున్నారు. వచ్చే వారం ఈడీ ముందకు ఆయన వెళ్లనున్నారు.  ఈనెల 1 థాయ్‌లాండ్‌లోని లాముంగ్‌ జిల్లా ఆసియా పట్టాయా పట్టణంలోని ఓ హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా క్యాసినో నిర్వహిస్తుండగా థాయ్ పోలీసులు దాడి చేశారు. మొత్తం 93 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వారిలో 83 మంది భారతీయులు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. చికోటి ప్రవీణ్‌‌తో పాటు అతని అనుచరుడు మాధవరెడ్డి, మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి, గాజుల రామారంకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి వాసుతో పాటు పలువురు మహిళలు కూడా ఉన్నారు.

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లటానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షల వసూలు చేసినట్లు చికోటి ప్రవీణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. వారిని అక్కడికి తీసుకువెళ్లి గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లు గుర్తించారు. పక్కగా నిఘా ఉంచిన థాయ్ పోలీసులు  వారు క్యాసినో నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ. 50 కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్, లక్ష అరవై వేల ఇండియన్ కరెన్సీ, దాదాపు 1000 మిలియన్ రూపాయల విలువైన జూదం క్రెడిట్‌ల రికార్డులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చీకోటి ప్రవీణ్ కు థాయ్‌లాండ్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన 83 మంది భారతీయులకు కూడా థాయ్‌లాండ్‌ కోర్టు బెయిల్ ఇచ్చింది.
 
ఇదిలా ఉండగా, గతేడాది కూడా ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్‌కు నోటీసులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి క్యాసినోల కోసం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా పలువుర్ని విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గతేడాది జులైలో ఈడీ కేసు నమోదు చేసి చికోటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
 
ఈ కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ సోదరులతో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రఘునాథరెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారు ఈడీ విచారణకు హాజరై.. విచారణకు సహకరించారు.