భజరంగ్ దళ్ ను నిషేదిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫేస్టోలో పెట్టడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ మేనిఫేస్టోకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, భజరంగ్ దళ్ నేతలు ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్ల ముట్టడికి యత్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ దగ్గర హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు ర్యాలీగా బయల్దేరిన బీజేపీ నేతలను పార్టీ ఆఫీస్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు.
దీంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ బారీకేడ్లపై దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటూ గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
భజరంగ్ దళ్ నేతలు హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. భజరంగ్ దళ్ నేతలకు పోటీగా కాంగ్రెస్ మహిళా నేతలు కూడా హనుమాన్ చాలీసా పఠనం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.
నిజామాబాద్ లోనూ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ బీజేపీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన చేయడానికి బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అక్కడే అరెస్టు చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట కూడా బీజేపీ నాయకులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ నిరసన చేపట్టారు. హనుమాన్ చాలీసా పఠనం కోసం కాంగ్రెస్ కార్యాలయానికి బయల్దేరిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నడిరోడ్డు పై బైఠాయించి హనుమాన్ చాలీసా పఠనం చేశారు బీజేపీ నేతలు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ సహా 100 మందిని అరెస్ట్ చేశారు.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టలో నుండి తీసేయాలని డిమాండ్ చేశారు. హిందూ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
కాగా, భజరంగ్దళ్ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించడం ఎంత వరకూ సమంజసమో ఆ పార్టీ విశ్లేషించుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి హితవు చెప్పారు. హిందువులు విశ్వసించే భావాలకు, నమ్మకాలకు వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్ను మెజారిటీ ప్రజలు అనుమానించే పరిస్థితిని ఆ పార్టీయే స్వయంగా సృష్టించుకుంటోందని ఆమె ధ్వజయంట్టారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటనను యూపీఏ భాగస్వాములుగా ఉందామనుకుంటున్న ఎన్ని రాజకీయ పార్టీలు సమర్ధిస్తాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. భజరంగ్దళ్పై నిషేధం, ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర విమర్శలు… ఇవన్నీ ఎంఐఎం వంటి పార్టీల అనుకూలత కోసమే అనే విషయాన్ని ప్రజల్లో ఆలోచన రేపుతోందని ఆమె తెలిపారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్