దేశవ్యాప్తంగా వంద ఆరోగ్యకర, పరిశుభ్రమైన ఫుడ్ స్ట్రీట్స్‌

దేశవ్యాప్తంగా వంద ఆరోగ్యకర, పరిశుభ్రమైన ఫుడ్ స్ట్రీట్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉన్నతాధికారులతో గురువారం ఫుడ్ స్ట్రీట్స్ ప్రాజెక్ట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఆరోగ్యకరమైన ఆహార పద్దతులను పోత్రహించడం, తిండి ద్వారా వచ్చే అనారోగ్యాలను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం.  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వంద ఫుడ్ స్ట్రీట్స్ మంజూరు కాగా… అందులో 4 ఆంధ్రప్రదేశ్‌లో, 4 తెలంగాణలో ఏర్పాటు కానున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని ఒక్కో ఫుడ్ స్ట్రీట్‌కి కోటి రూపాయల చొప్పున నిధులు అందిస్తుంది.
 
ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్గదర్శకాల ప్రకారం ఈ ఫుడ్ స్ట్రీట్‌ల బ్రాండింగ్ జరగాల్సి ఉంటుంది. సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన అలవాట్లు, టాయిలెట్ సౌకర్యాలు, డస్ట్‌బిన్‌ల ఏర్పాటు, బిల్‌బోర్డ్‌లను ఉపయోగించడం వంటి కార్యకలాపాలకు కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ కార్యక్రమం అమలవుతుంది.
 
ఫుడ్ స్ట్రీట్ల డిజైన్లు, ఎస్ఓపీ రూపకల్పన, విపత్తు విశ్లేషణ, ప్రోటోకాల్ కింద శిక్షణ అందించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వేగవంతమైన పట్టణీకరణతో స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అవసరం పెరుగుతోంది. ఫుడ్ స్ట్రీట్స్ కోట్లాది మందికి సరసమైన ధరలకే రుచికరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది.