రాజద్రోహ చట్టంపై సుప్రీం విచారణ వాయిదా

ఇంతకు ముందటి రాజద్రోహ నేరం, ఇప్పటి వాడకపు దేశద్రోహంచట్టంపై పలు పిటిషన్లపై విచారణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. ఈ వలస కాలపు పాత చట్టం పునః పరిశీలన ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్రం తెలియజేయడంతో సంబంధిత పిటిషన్ల విచారణ ప్రక్రియను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నారు.

ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్థివాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సమర్పించిన వివరణను తాము పరిగణనలోకి తీసుకున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. చట్టం పునః పరిశీలన, దీనిపై తుది నిర్ణయానికి మరింత గడువు కావాలని కేంద్రం కోరింది.

ఈ ప్రక్రియ చివరి దశలో ఉందని, పార్లమెంటుకు వెళ్లే ముందు దానిని తనకు చూపుతామని వెంకటరమని చెప్పారు. ”పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత ఈ అంశాన్ని తదుపరి విచారణకు దయచేసి వాయిదావేయండి” అని ఆయన ధర్మాసనాన్ని కోరారు. సవరించిన చట్టాన్ని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందువల్ల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తరువాత ఆగస్టు రెండో వారానికి ఈ కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

ఐపిసి పరిధిలోని 124 ఎ నిబంధన సమీక్ష చేపట్టినట్లు, దీనిపై నిపుణుల సలహాలు సంప్రదింపుల పర్వం ఇప్పుడు దాదాపుగా పూర్తి కావస్తోందని, నిర్ణయం తీసుకునే వీలేర్పడిందని, ఈ క్రమంలో విచారణ విషయం గురించి ఆలోచించాలని కేంద్రం అభ్యర్థించింది. దీనిని మన్నించిన ధర్మాసనం వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది.

ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల శంకరనారాయణ తమ వాదన విన్పిస్తూ ఇది కీలకమైన విషయం అయినందున దీనిని విచారించేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఇది వీలు కాదని, ముందుగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలన కీలకం అని పేర్కొన్నారు.

రాజద్రోహ నేరం వలసపాలన కాలం నాటిదని , దీనిని ఎత్తివేయాలని పలు పౌర హక్కుల సంఘాలు, విడిగా వ్యక్తుల నుంచి సుప్రీంకోర్టులో కేసులు దాఖలు అయ్యాయి. ఈ దశలోనే సుప్రీంకోర్టు గత ఏడాది మే 11న సంచలనాత్మక ఆదేశాలు వెలువరించింది. రాజద్రోహం చట్టం పరిధిలో అభియోగాలను పరిశీలించేందుకు సముచితమైన ప్రభుత్వ ఫోరం ఏర్పాటు కావాలని, అప్పటివరకూ కేంద్రం లేదా రాష్ట్రాలు రాజద్రోహ కేసులను పౌరులపై మోపరాదని ఈ ఆదేశాలలో పేర్కొన్నారు.