విద్రోహ చర్యను నివేదించిన జర్నలిస్టుపై కేసులా?

మత విద్వేషాలు రెచ్చగొడుతూ, హిందూ – ముస్లింల మధ్య వివాదాలు సృష్టించే విధంగా వీడియోలు తీస్తున్న వ్యక్తిని వదిలిపెట్టి, అటువంటి వ్యక్తి గురించి పోలీసుల దృష్టికి తీసుకొచ్చిన జర్నలిస్ట్ పై కేసు పెడతారా? అంటూ విశ్వహిందూ పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ప్రశాంతమైన భాగ్యనగరంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉగ్రవాదులు ఉన్నారని, నగరంలోని మల్లేపల్లి కి చెందిన ఖాజా బాసిత్ షరీఫ్ అనే వ్యక్తి అందుకు సాక్ష్యం అని వీహెచ్‌పీ  నేతలు ఆరోపించారు. హిందూ ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేలా మాట్లాడటం, వీడియోలు క్రియేట్ చేయడంతో పాటు రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
 
వీహెచ్‌పీ  రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ కార్యదర్శి వీరేష్  విలేకరులతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి మందిరాన్ని, అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని కూల్చివేస్తానని వీడియోలు విడుదల చేస్తున్న కూడా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అత్యంత భయంకరమైన ఉగ్రవాదులు యాకూబ్ మెమన్, అఫ్జల్ గురులకు భారతరత్న ఇచ్చి సత్కరించాలని ఖాజా బాసిత్ షరీఫ్ డిమాండ్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం అంటూ మండిపడ్డారు. భాగ్యనగర్ లోని ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి విక్టోరియా ప్లే గ్రౌండ్స్ మధ్యలో ఉన్న హిందూ మందిరాలను కూల్చి వేస్తానని హెచ్చరిస్తున్నాడని అంటూ ఇలాంటివి అనేక వీడియోలు చేస్తున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
 
ఈ విషయాలను ఓ విలేఖరి బయట పెట్టడంతో పోలీసులు  విలేకరిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఏప్రిల్ 26న షరీఫ్ వివాదాస్పదంగా విడుదల చేసిన వీడియోలను నగర కమిషనర్ గారికి మహేష్ ఉపాధ్యాయ అనే రిపోర్టర్ షేర్ చేశాడని వారు చెప్పారు. అయితే, దీంతో ఖాజా బాసిత్ షరీఫ్ పై కేసు నమోదు చేస్తూ ఎ-1గా, జర్నలిస్ట్ మహేష్ ఉపాధ్యాయపై ఎ-2 గా కేసు నమోదు చేయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహేష్ ఉపాధ్యాయ పై కేసు ఎత్తివేసి, రెచ్చగొట్టే వీడియోలు చేసిన షరీఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.