తమిళనాడులో బహిరంగ ప్రదేశాల్లో మద్యంకు అనుమతి

విచ్చలవిడిగా, ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించేందుకు సౌలభ్యం కలిగిస్తూ  తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు అనుమతిచ్చింది. స్పోర్ట్స్ స్టేడియాలతో సహా పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొచ్చని స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.తమిళనాడులో మద్యం అమ్మకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. దీనికోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)పేరుతో ఓ సంస్థనే నెలకొల్పింది. ప్రైవేటు కంపెనీలు, బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సహా అన్ని రకాల మద్యం టస్మాక్ అవుట్‌లెట్స్‌లల్లో లభిస్తాయి.

తమిళనాడు రాష్ట్రంలోని సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాలలో మద్యం అందించడానికి ప్రత్యేక లైసెన్స్‌ విధానాన్ని తీసుకువచ్చింది. తమిళనాడులో మద్యం అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలకు భిన్నంగా స్టాలిన్ ప్రభుత్వం తాజా చర్య తీసుకుంది.

2016లో అప్పటి తమిళనాడు  ముఖ్యమంత్రి జయలలిత మద్యం అమ్మకాలపై కొరఢా ఝుళిపించింది. ఏకంగా 500 మద్యం దుకాణాలను మూసివేసింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల టైమింగ్స్ ను తగ్గించింది. జయ మరణం తర్వాత సీఎం పీఠం ఎక్కిన ఎడప్పాడి కె. పళనిస్వామి జయలలిత తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించారు.

ఫిబ్రవరి 20, 2017న ప్రభుత్వ రంగ టాస్మాక్ ఆధ్వర్యంలో నడిచే 500 మద్యం దుకాణాలను మూసివేయించారు. ఇందులో భాగంగానే  ఓ పన్నీర్‌సెల్వం ప్రభుత్వం జనవరి 2002లో  టాస్మాక్ ద్వారా తక్కువ ధరకు మద్యాన్ని విక్రయించే విధానాన్ని  ప్రారంభించింది.