కేరళలో మోదీపై దాడి చేస్తామన్న లేఖ కేసులో ఒకరు అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తానని లేఖ రాసాడని భావిస్తున్న వ్యక్తిని ఆదివారం కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ సోమవారం కేరళకు రెండు రోజుల పర్యటనపై రానున్నారు. నిందితుడు పి.జావియర్ అనే వ్యక్తి ఆ ఉత్తరాన్ని రాశాడని కొచ్చి పోలీస్ కమిషనర్ కె. సేతురామన్ తెలిపారు.

అతడు తనకు దూరమైన మిత్రుడు, పొరుగువాడిని ఇరికించేందుకు ఇలా చేసాడని చెబుతూ అతని చేతి వ్రాతను ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాకే జావియర్‌ని అరెస్టు చేశామని చెప్పారు.  ఆ ఉత్తరాన్ని మలయాళంలో రాయడం జరిగింది. అది తిరువనంతపురంలోని బిజెపి కార్యాలయంలో ఎన్.కె.జాని అనే వ్యక్తి రెండు రోజుల క్రితమే అందింది. తర్వాత దానిని పోలీసులకు అందజేయడం జరిగింది.

‘తన పొరుగు వ్యక్తిని ఇరికించడానికే అతడా ఉత్తరం లేఖ రాశాడు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే అతడా ఉత్తరం రాసి ఉంటాడని పేర్కొన్నాడు. ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా మేము దీనిని నిర్ధారించుకున్నాము’ అని పోలీస్ కమిషనర్ వివరించారు.

ఇదిలావుండగా, ప్రధాని పర్యటన సందర్భంగా సెక్యూరిటీ డ్రిల్ సమాచారం లీకేజీ కావడంపై, ఎంపిక చేసిన ఉన్నతాధికారులకు పంపిన సెక్యూరిటీ డ్రిల్ వివరాలు మీడియాకు లీక్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. 49 పేజీల ఆ సర్కూలర్‌లో ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్, పోలీసు అధికారుల మోహరింపు, ప్రధాని పర్యటనకు ముందు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు కూడా ఉన్నాయి.

కేంద్ర మంత్రి వి. మురళీధరన్ ప్రధాని భద్రత ఏర్పాట్ల వివరాలు లీక్ కావడంతో అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోం పోర్ట్‌ఫోలియో కూడా కలిగి ఉన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై, కేరళ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇంత పెద్ద లొసుగుపై ముఖ్యమంత్రి తన బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.