రూ.125.16 కోట్లతో గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన గతిశక్తి ప్రాజెక్టు కింద గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులకు రూ.125.16 కోట్లు మంజూరు చేశారు. సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరో వారం రోజుల్లో ఇందుకోసం టెండర్లు పిలిచేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 ప్రాజెక్టు పనులు పూర్తయితే గుంటూరు స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశముంది.  ప్రాజెక్టు పనులు పూర్తయితే గుంటూరు స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశముంది. గుంటూరు రైల్వే స్టేషన్‌ మీదుగా రోజూ కనీసం 100 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ మొత్తం ఏడు ప్లాట్ఫారాలు ఉన్నాయి.
 
అయినా పూర్తి స్థాయిలో రైళ్లను నిలపడం ఇబ్బందికరంగా మారింది. రెండు ప్లాట్‌ ఫారాలు మినహా మిగిలిన వాటిలో 24 బోగీలు నిలిపే స్థలం లేదు. పురాతన కాలంనాటి సిగ్నల్‌ వ్యవస్థ కావడంతో త్వరగా రైళ్లను స్టేషన్లోకి అనుమతించేందుకు ఇబ్బందికరంగా తయారైంది.
 
గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా అరండల్‌పేట వైపు కొత్తగా 8వ లైను నిర్మించనున్నారు.  ఆధునికీకరణ పనులు పూర్తయితే అన్ని ప్లాట్‌ ఫారాల మీద 24 బోగీలు నిలిపే సౌకర్యం రానుంది. దీనివల్ల అదనంగా ఎక్సెస్ర్‌ రైళ్లు నడిపే వీలుంటుంది. కంప్యూటర్‌ ద్వారా సిగ్నల్స్‌ అందుతాయి. రైళ్ల రాకపోకల్లో సమయం ఆదా అవుతుంది.
 
ఖాళీగా ఉండే రైళ్లను నిలిపేందుకు అదనంగా రెండింటిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం లేనందున నల్లపాడు, సిరిపురం స్టేషన్లలో వాటిని నిలిపి ఉంచుతున్నారు. అదేవిధంగా స్టేషన్లోని ప్రధాన మార్గం నుంచి లూప్‌లైన్‌ వరకు పాయింట్స్‌, క్రాసింగ్స్‌ మార్చనున్నారు.  గుంటూరు నుంచి కేసీకెనాల్‌ వైపు, తెనాలి మార్గం వైపు వెళ్లే రైళ్లు రెండు లైన్ల నుంచి ఒకేసారి వెళ్లే సదుపాయం కలగనుంది. ఈ పనులన్నింటిని వీలైనంత తొందరగా పూర్తిచేసేందుకు రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు.