ఫూంచ్ ఉగ్ర‌దాడిలో ఐదుగురు జ‌వాన్ల స‌జీవ‌ద‌హ‌నంతో హైఅలెర్ట్

జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఫూంచ్ వ‌ద్ద ఆర్మీ ట్ర‌క్కులో ఆక‌స్మాత్తుగా మంట‌లు సంభ‌వించిన ఐదుగురు జవాన్లు సజీవదహనమైన ఘ‌ట‌న‌ను భార‌త సైన్యం ఉగ్ర‌దాడిగా తేల్చింది.  మ‌రో జ‌వాన్ తీవ్రంగా గాయ‌పడగా, గాయపడ్డ జవాన్ ను రాజౌరిలోని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ దాడి జరగడంతో హైఅలర్ట్ ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు ఎలాంటి కదలికలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. 
 
ఫూంచ్ ప‌రిధిలోని భీంబ‌ర్ గాలి ఏరియాలో బింభేర్‌ గలి నుంచి పూంఛ్‌ జిల్లాలోని సాంగియోట్‌ వైపు వెళ్తుండగా గురువారం మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల స‌మ‌యంలో ర‌హ‌దారిపై వెళ్తున్న ఆర్మీ ట్ర‌క్కును ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు గ్ర‌నేడ్ల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, దీంతో ట్ర‌క్కులో మంట‌లు సంభ‌వించిన‌ట్లు సైన్యం నిర్ధారించింది. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులతో పాటు, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌, ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి సెక్టార్‌లలో కూడా ఉగ్రవాదులు పాక్ వైపు నుంచి తిరిగి చొరబడకుండా హై అలర్ట్ ప్రకటించారు.

భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న ఉగ్రవాదులు మన సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఆర్మీ ట్రక్కుపై పిడుగుపడి జవాన్లు చనిపోయారని ముందుగా అనుకున్నారు. కానీ, అన్ని అనుమానాలు ఉండడంతో విచారణ మొదలుపెట్టడంతో అసలు విషయం బయటపడింది. భారీ వర్షం కారణంగా భారత బలగాలు గుర్తించలేదు.

ఆర్మీ ట్రక్కుపై జరిగిన గ్రెనేడ్ దాడి జరిగిందని భారత సైనికులు నిర్ధారించారు. గ్రెనేడ్ దాడి జరిగిన తర్వాత ట్రక్కులో పెద్ద ఎ్తతున మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. అయితే భారీ వర్షం కారణంగా భారత బలగాలు గుర్తించలేదు. ఈ ఘ‌ట‌న‌పై సైనిక ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

ఐదుగురు జ‌వాన్ల మృతిపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇది దుర‌దృష్ట‌క‌రం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించారు. వారి కుటుంబాల‌కు అన్ని విధాలా అండగా ఉంటామ‌ని రాజ్‌నాథ్ సింగ్ భ‌రోసా ఇచ్చారు. ఇటీవల పంజాబ్‌లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే ఈ విషాదం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్ దేశానికి చెందిన సరిహద్దు యాక్షన్ టీం అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గతంలో రాజౌరి, పూంచ్ సెక్టార్లలో సైన్యం, పౌరులపై ఇదే విధంగా పాక్ దేశానికి చెందిన బార్డర్ యాక్షన్ టీం రెండు దాడులు జరిగాయని వారు తెలిపారు. ఈ దాడి అనంతరం భారత భద్రతా దళాలు మెంధార్ సబ్-డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో భారీ కార్డన్ సాగిస్తున్నాయి.

సైన్యం, పోలీసుల సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో గాలిస్తున్నారు. భారీగా బలగాలను మోహరించారు. భాటా ధురియన్, నార్ ఫారెస్ట్, సంజియోట్, కోటన్‌తో సహా పలు గ్రామాలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సాయుధ పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.ఉగ్రదాడి తర్వాత భింబర్ గలి, భాటా ధురియన్ మధ్య జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

భటా ధురియన్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో భింబర్ గలి నుంచి సురన్‌కోట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు పూంచ్ జిల్లా పోలీసులు తెలిపారు.జి 20 సమావేశాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.