శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు

శ్రీవారి నైవేద్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారీకి కూడా సేంద్రీయ ఉత్పత్తులు వినియోగిస్తామని పేర్కొన్నారు. తిరుమలలో సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దాతల సాయంతో అందించిన రూ. 10 లక్షల వ్యయంతో బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పద్మావతి మెడికల్ కాలేజీలో టీబీ విభాగం ఏర్పాటుకు రూ. 53.62 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
 
అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణానికి రూ. 18 కోట్లు, కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ. 14 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఢిల్లీలోని ఆడిటోరియం అభివృద్ధి పనులకు రూ. 4 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో భోదనా సిబ్బంది నియామకానికి పాలకమండలి అంగీకారం తెలిపిందని చెప్పారు.
 
ఇక, ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో మే 3 నుంచి 13వ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు రూ.3.12 కోట్లు కేటాయించిందనట్లు పేర్కొన్నారు.  జూన్ 15 కల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అలాగే, విదేశీ కరెన్సీ మార్పిడిపై కేంద్రం విధించిన రూ. 3 కోట్ల జరుమానాను రద్దు చేయాలని హోం శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.