వెన్న, నెయ్యి వంటి డెయిరీ ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోబోమని కేంద్ర ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ శాఖల మంత్రి పురుషోత్తం రూపాలా ప్రకటించారు. దేశంలోనే వీటి ఉత్పత్తిని మరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. చాలా ప్రాంతాల్లో నెయ్యికి, వెన్నకు చాలా కొరత ఉందని, వీటిని దిగుమతి చేసుకునే పరిస్థితి రావొచ్చని ఈశాఖ సీనియర్ అధికారి ఒకరు గత వారం చెప్పారు. పశువులకు లంపీస్కీన్ వ్యాధి రావడం వల్ల పాల ఉత్పత్తి యదాతథంగా ఉంటుందని, పెరిగే అవకాశం లేదని ప్రకటించడంతో రూపాల ఈ వివరణ ఇచ్చారు.
‘‘డెయిరీ ఉత్పత్తులకు కొరత ఏమీ లేదు. దిగుమతులు ఉండవు. పాల ఉత్పత్తిని మేం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. పాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీని ఉత్పత్తిని పెంచడానికి మనదేశంలోనే చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆందోళన అవసరం లేదు” అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి వివరించారు.
డెయిరీ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంపై మాట్లాడుతూ దీని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, రైతుల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2021–-22లో భారతదేశపు పాల ఉత్పత్తి 221 మిలియన్ టన్నులు కాగా, అంతకుముందు సంవత్సరంలో ఇది 208 మిలియన్ టన్నులు.
మాజీ వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ గత వారం ప్రధానికి ఈ విషయమై ఒక లేఖ వ్రాస్తూ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవద్దని, దీనివ్లల దేశీయ పాల ఉత్పత్తిదారుల ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. మనదేశం చివరిగా 2011లో పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.
జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి రూపాలా ఈ సందర్భంగా రెండు జంతు ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి — యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఇనీషియేటివ్ (ఏపీపీఐ) ఒకటి కాగా, రెండోది ప్రపంచ బ్యాంకు నిధులతో వన్ హెల్త్ కోసం యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ (ఏహెచ్ఎస్ఎస్ఓహెచ్).
డిజిటల్ నిఘా ద్వారా జంతు వ్యాధులను పరిశీలించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సాయం అందించడానికి ఏపీపీఐని మొదలుపెట్టారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు రూ. 1,228 కోట్లు కేటాయిస్తుంది. ఈ ప్రాజెక్టును మొదట్లో అస్సాం, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ మహారాష్ట్రలలో అమలు చేస్తారు.
ఇలా ఉండగా, పాల సగటు రిటైల్ ధర పోయిన సంవత్సరం నుంచి 12 శాతం పెరిగి లీటరుకు 57.15 రూపాయలకు (0.6962 డాలర్లు) చేరింది. కరోనా కారణంగా పాలకు డిమాండ్ పడిపోయింది. ఆ సమయంలో ఆవులకు తగినంత దాణా కూడా అందించకపోవడంతో దిగుబడి తగ్గింది. ధాన్యాల ధర మరింత ఖరీదైనదిగా మారింది.
మనదేశంలో పాల ధరల పెరుగుదల ఇన్ఫ్లేషన్ను పెంచుతుంది. ప్రస్తుతం మిల్క్ ఇన్ఫ్లేషన్ 9.31 శాతం వరకు ఉంది. మనదేశంలో దాదాపు ప్రతి కుటుంబమూ పాలను వాడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో నెయ్యి, వెన్నలను కూడా విరివిగా వాడతారు. పాల కొనుగోలు ఖర్చులు పెరుగుతూనే ఉండటంతో డెయిరీ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి. ధాన్యాలు, బియ్యం ఊక, పశుగ్రాసం ధరలు పెరగడంతో చలికాలంలో పాల ధరలు 12శాతం–-15శాతం పెరిగాయి.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది