దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్

దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల విలువ కలిపి రూ.1,018.86 కోట్లు ఉంటే, అందులో 50.09 శాతం ఆస్తులు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీదే ఉన్నాయి.

దేశంలో మిగిలిన 29 మంది ముఖ్యమంత్రి ఆస్తుల విలువ కలిపి రూ.508 కోట్లు ఉంది. జగన్‌ మోహన్‌రెడ్డి ఆస్తి విలువ రూ.510.38 కోట్లుగా ఉంది. ఇందులో రూ.443 కోట్ల చరాస్తులు ఉండగా, మిగతావి స్థిరాస్తులు ఉన్నాయి.  ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు నేతృత్వం వహిస్తున్న 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు సంయుక్తంగా ఈ వివరాలు వెల్లడించాయి.

తాజా ఏడిఆర్‌ జాబితా ప్రకార పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి అందరి కంటే తక్కువగా రూ.15 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడున్న 30 మంది ముఖ్యమంత్రుల్ 29 మంది కోటీశ్వరులేనని వెల్లడైనది. దేశంలోని మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది (43శాతం)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, బెదిరింపులతో సహా తీవ్రమైన కేసులున్నట్లుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని ఏడీఆర్‌ పేర్కొంది. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఐదేళ్లకుపైగా జైలు శిక్షతో కూడిన నాన్ బెయిలబుల్ నేరాలని తెలిపింది.

 దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం, అంటే 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తి రూ.33.96 కోట్లుగా ఉంది.
 రూ.510 కోట్లతో జగన్ మొదటి స్థానంలో,  రూ.163 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో, రూ.63 కోట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులు రూ.23 కోట్లు అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తి రూ.15 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆస్తి కోటి రూపాయలు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆస్తి కోటి రూపాయల పైనే ఉందని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదికలు వెల్లడించాయి. వీరు ముగ్గురు దేశంలోని ముఖ్యమంత్రులతో అత్యంత తక్కువగా ఆస్తులు గలవారు.

 బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆస్తి రూ.3 కోట్లు , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.3 కోట్లకు పైగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్తులు కోటి రూపాయలకు పైగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.  నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో ఆస్తుల విలువ రూ.46 కోట్లు. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామికి రూ.38 కోట్ల విలువైన సంపద ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు రూ.17 కోట్లు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మాకు రూ.14 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి.

ఎక్కువ అప్పులు ఉన్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ రూ. 8.8 కోట్లతో తొలి స్థానంలోనూ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రూ. 4.9 కోట్లతో రెండో స్థానంలోనూ ఉన్నారు. బొమ్మై ఆస్తుల విలువ రూ.8.92 కోట్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రూ.11.6 కోట్ల విలువైన ఆస్తులు, రూ.3.75 కోట్ల అప్పులు ఉన్నాయి.