వరంగల్ పోలీస్ కమీషనర్ పై సంజయ్ పరువు నష్టం దావా!

పదో తరగతి పేపర్‌ లీక్ కేసులోతనను మొదటి నిందితుడిగా పేర్కొనడంతో పాటు అందులో తనది కీలక పాత్ర అంటూ వాఖ్యలు చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ పై పరువు నష్టం దావా వేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తన హక్కుల భంగంతో పాటు ఇతర విషయాలపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయాలని కూడా నిశ్చయించుకున్నారు. తన మీద చేసిన ఆరోపణలపై కూడా న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
 

“వరంగల్‌ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం. నా ఫోన్‌ ఇవ్వడం లేదని అంటున్నారు. ముందు సీపీ ఫోన్‌ కాల్‌ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈటల రాజేందర్‌ ఫోన్‌ అడిగే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నా ఫోన్‌ కేసీఆర్‌ దగ్గరే ఉంది. మీ దగ్గరే నా ఫోన్‌ పెట్టుకుని నన్ను ఎందుకు అడుగుతున్నారు. నా ఫోన్లో నాకు టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలని చూసి కేసీఆర్‌కు చక్కర్ వచ్చింది. అందుకే ఫోన్ దగ్గర పెట్టుకొని ఇవ్వట్లేదు.” అంటూ బండి సంజయ్ తెలిపారు.

మరోవైప, ఈ రోజు విచారణకు రావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంజయ్ సమాధానం చెప్పారు. తన ఫోన్ పోయిందని ఇప్పటికే ఫిర్యాదు చేశానని పేర్కొంటూ తన ఫోన్ దొరికే దాగా తనను విచారణకు పిలవొద్దని స్పష్టం చేశారు. ప్రతీసారి తనకు నోటీసులు ఇస్ తాను లీగల్‌గా ముందుకు వెళతానని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, బండి సంజయ్ రిమాండ్ ఆర్డర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే  సంజయ్ బెయిల్ మీద బయటికి వచ్చినట్టు కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. సంజయ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని కోర్టుకు ఏజీ తెలిపారు. సంజయ్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఏజీ వెల్లడించారు.
 
విచారణకు సహకరించనందుకు బెయిల్ రద్దు చేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో  సంజయ్ బెయిల్ రద్దుపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తనకు బెయిల్ రావద్దు అని ఎలా అంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తానేమైనా ఉగ్రవాదినా అని ప్రశ్నించారు. 
రిమాండ్ మీద విచారణ అవసరం లేదని ఏజీ వాదించారు. ఫోన్ ఇవ్వకపోవడం, పోలీసులకు సహకరించడం లేదన్న విషయాలను అఫిడవిట్ దాఖలు చేసి ఆన్ రికార్డ్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి హైకోర్టు వాయిదా వేసింది.