బందీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌లో సఫారీ ట్రిప్ వేశారు. ఆదివారం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీని ప్రధాని సందర్శించారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 ఏళ్లు పూర్తెన సందర్భంగా  20 కి.మీ పాటు మోడీ సఫారీ వాహనంలో ప్రయాణించారు.   ఈ సందర్భంగా పులల సంరక్షనుకు చేపట్టిన చర్యలు, జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి కేంద్రాలు, ఏనుగుల శిబిరాలను  అధికారులు ప్రధానికి చూపించారు.
దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ప్రధాని సరికొత్తగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్‌ వెళ్లారు. ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు.
ఇక్కడే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలెఫెంట్ విస్ఫరర్స్’ మూవీని చిత్రీకరించారు. ఆ డాక్యుమెంటరీలో కనిపించిన ఏనుగులను ప్రధాని చూశారు. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, వల్లిలను కలిసిన ప్రధాని డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్లి దానిని ముద్దు చేశారు. అనంతరం రఘుకు చెరుకుగడలు తినిపించారు. మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, అద్భుతమైన బొమ్మన్, బెల్లీలను, వారితోపాటు బొమ్మి, రఘు ఏనుగులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
దేశంలో పెరుగుతున్న పులుల సంఖ్య
ఆ త‌ర్వాత ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా మైసూరులో పులుల గణాంకాలను ఆయన విడుదల చేశారు. 2006లో 1,411 పులులు, 2010లో 1,706 పులులు, 2014లో 2,226 పులులు, 2018లో 2,967 పులులు ఉండేవని తెలిపారు. 2006తో పోల్చినపుడు ప్రస్తుతం పులుల సంఖ్య 124.45 శాతం పెరిగిందని తెలిపారు. 2018లో 2,967 పులులు ఉండేవని, ఈ సంఖ్య 6.74 శాతం పెరిగి, నేడు 3,167 పులులకు పెరిగిందని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చిన అమృత కాలంలో పులుల సంఖ్య పెరుగుదలపై విజన్ డాక్యుమెంట్‌ను మోదీ విడుదల చేశారు. రూ.50 స్మారక నాణేన్ని, భారత దేశంలో పులుల అభయారణ్యాల మదింపు నివేదికను కూడా విడుదల చేశారు. పులులు, చిరుతలు, సింహాలు, మంచు చిరుతలు, పూమాలు, జాగ్వార్‌లు వంటి ఏడు రకాల బిగ్ కేట్స్ సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ కేట్ అలయెన్స్‌ను ప్రధాని ప్రారంభించారు. కూటమిలో దాదాపు 97 దేశాలు ఉన్నాయి.

వాతావరణ మార్పులతో సహా అనేక రకాల ముప్పుల వల్ల ఈ జంతువులు అంతరించిపోకుండా నిరోధించడంపై ఈ కూటమి దృష్టి సారిస్తుంది. ఈ జంతువుల సంరక్షణకు ఆచరించదగిన చర్యలను నిర్ణయిస్తుంది. నిధులను కూడా సమకూర్చుతుంది. పులుల అభయారణ్యాలు 2006లో 28 ఉండేవని, నేడు వీటి సంఖ్య 51కి పెరిగిందని ప్రధాని తెలిపారు. మన దేశంలో పులుల సంరక్షణ కోసం పటిష్టమైన విధానాలను అమలు చేస్తున్నామని, అందువల్ల సింహాల సంఖ్య 29 శాతం పెరిగిందని చెప్పారు. 2020లో గుజరాత్‌లో 674 సింహాలు ఉండేవని, 2015లో వీటి సంఖ్య 523కు పెరిగిందని తెలిపారు.

 దేశవ్యాప్తంగా చిరుత పులుల సంఖ్య 63 శాతం పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. 2014లో 7,910 చిరుతపులులు ఉండేవని, 2018లో 12,852కు వీటి సంఖ్య చేరిందని తెలిపారు. చీతాలు అంతరించిపోకుండా కాపాడటం కోసం 2022లో విదేశాల నుంచి మన దేశానికి చీతాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా ట్రాన్స్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ జరగడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని తెలిపారు. అస్సాంలో ఒక కొమ్ము ఉన్న రినోసారస్‌ల వేట జరగకుండా నిరోధించగలిగామని చెప్పారు.