దిబ్రూఘర్‌ యోగా మహోత్సవ్‌లో వేలాది మంది యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 నిర్వహణకు సన్నాహక కార్యక్రమంగా భాగంగా దిబ్రూఘర్‌లో జరిగిన యోగా మహోత్సవ్‌ లో వేలాది మంది పాల్గొని యోగాసనాలు వేశారు. దిబ్రూఘర్‌ విశ్వవిద్యాలయంలో సామూహిక యోగా కార్యక్రమం జరిగింది.
కేంద్ర ఆయుష్, ఓడ రేవులు, నౌక రవాణా, జలమార్గాల శాఖ మంత్రి  సర్బానంద సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డా) మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్, , కేంద్ర  పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి  రామేశ్వర్ తెలీ, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్, అస్సాం ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రి కేశబ్ మహంత,  మణిపూర్ ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ సనమ్ రంజన్ సింగ్, దిబ్రూఘర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జితేన్ హజారికా, వైద్య రాజేష్ కోటచా పాల్గొన్నారు. 

సహజ అందాలకు నిలయమైన దిబ్రూఘర్‌లో యోగా మహోత్సవం నిర్వహించడం పట్ల సర్బానంద సోనోవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించి ఆరోగ్యం సంరక్షణ కోసం అన్ని దేశాల ప్రజలు యోగా ఆచరించేలా చూడాలన్న ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారని  ప్రశంసించారు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున యోగా మహోత్సవం నిర్వహించామని చెబుతూ దిబ్రూగఢ్‌లో 100 పడకల యోగా, నేచురోపతి ఆసుపత్రి నిర్మిస్తామని  ప్రకటించారు. ఆస్పత్రి నిర్మాణంతో ప్రాంతంలో మెరుగైన  ఆరోగ్య సంరక్షణ చర్యలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈశాన్య భారతదేశంలో తొలిసారిగా చేపట్టిన నిర్మాణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు మంత్రి  కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కేంద్రం అస్సాం ప్రజలకు యోగా, నేచురోపతి ఔట్ పేషెంట్,  ఇన్‌పేషెంట్ చికిత్సలను అందించడం ద్వారా ప్రాంత ఆరోగ్య అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. 

యోగా అభ్యాసకులకు అవసరమైన సౌకర్యాలు  అభివృద్ధి చేయడానికి మొరార్జీ  దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, దిబ్రూఘర్ విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.  యోగాను ప్రతి ఒక్కరి ఆరోగ్యకరమైన జీవనశైలి లో భాగం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 

అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ మాట్లాడుతూ  యోగాని  భారతదేశం   గొప్ప వారసత్వ సంపదగా వర్ణించారు. యోగా చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగు పడుతుందని అన్నారు. యోగా ఆరోగ్యకర భవిష్యత్తు అందిస్తుందని చెప్పారు.  ప్రపంచానికి భారతదేశం అందించిన విలువైన బహుమతి యోగ అని ఆయన పేర్కొన్నారు.

వేలాది మంది భారతీయ విద్యార్థులు, టాంజానియా, ఉగాండా, కెన్యా, టోగో, నేపాల్, నైజీరియా, లెసోతో, బోట్స్వానా, ఈజిప్ట్, నమీబియా, కొరియా దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు, యోగా ప్రియులు యోగా మహోత్సవ్‌లో పాల్గొన్నారు. మొరార్జీ  దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా    డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి. బసవరెడ్డి యోగా ప్రదర్శనలపై  మార్గనిర్దేశం చేశారు.