నటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు కుష్బూ సుందర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరినట్లు సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. నిర్లక్ష్యం చేయొద్దంటూ తన అభిమానులకు జాగ్రత్తలు సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చెన్నై రానున్నారు. చెన్నై నగరంలో అత్యాధునిక హంగులతో కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్టు టెర్మినల్ను ప్రారంభించనున్నారు. కుష్బూ సుందర్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ఆస్పత్రిలో చేరడంతో హాజరు కాలేకపోతున్నారు. ‘నేను చెప్పినట్లు ఫ్లూ జ్వరం చాలా చెడ్డది. ఇప్పుడిది నాపై ప్రభావం చూపుతోంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వేధిస్తున్నాయి. అదృష్టవశాత్తు ప్రస్తుతం నేను అపోలో ఆస్పత్రిలో మంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను’ అని కుష్బూ సుందర్ ట్వీట్ చేశారు.
‘మీ శరీరం ఇక సహకరించను అని సంకేతాలు ఇచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకండి’ అంటూ అభిమానులను ఉద్దేశించి ఖుష్బూ సూచన చేశారు. ‘కోలుకునేందుకు మార్గం ఉంది. అయితే, అందుకు సమయం పట్టేట్టు ఉంది’ అంటూ తన ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశించి ఖుష్బూ చెప్పుకొచ్చారు.
ఖుష్బూ ప్రస్తుతం అటు రాజకీయంగా, ఇటు సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు.
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తున్నారు. ఇటీవల తెలుగులో విడుదలైన ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2’ ట్రైలర్ విడుదల వేడుకకు హాజరయ్యారు. దర్శక దిగ్గజం మణిరత్నంతో తనకున్న అనుబంధం గురించి వివరించారు.
సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కొంత కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ఖుష్బూ కొన్నేళ్ల కిందట బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
More Stories
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్