సంజయ్ పరామర్శకు వచ్చిన రఘునందన్ రావు అరెస్టు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావ పోలీసులను ప్రశ్నించారు.

ఆయన చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకెళ్లారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తున్నారని రఘునందన్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు.

పోలీసుల తీరుపై సీరియస్ అయిన రఘునందన్ రావును పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకొని స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. రాష్ట్రంలో దుర్మార్గుల పాలన నడుస్తోందని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని రాష్ట్ర తీరుపై మండిపడ్డారు.

ఉగ్రవాదులు, నక్సలైట్లను అరెస్ట్ చేసిన్నట్లు ఒక ఎంపీని, జాతీయ పార్టీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని ఎటువంటి కారణం చెప్పకుండా అరెస్ట్ చేస్తారా అంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ అరెస్ట్ ఎందుకని ఆయన ప్రశ్నించారు.

హైకోర్టులో పిటీషన్

సంజయ్ అరెస్ట్ పై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టుకు సెలవు రోజు కావడంతో ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లి బిజెపి లీగల్ సెల్ నేతలు దాఖలు చేశారు.

మరోవంక, సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకొనేందుకు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వైపు వెడుతున్న బిజెపి లీగల్ టీం ప్రతినిధులను స్టేషన్ కు 3 కిమీ దూరంలోనే పోలీసులు నిలిపివేశారు.  కాగా, సంజయ్ పై నేరారోపణలు ఉన్నందునే అదుపులోకి తీసుకున్నామని భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు. అయితే నేరారోపణలు వివరాలను వెల్లడించలేదు. కేసు ఫైల్ చేశాకే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.