రాముల వారి కళ్యాణానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో?

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి, సీతారాముల వారిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు అంత వివక్ష అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నించింది. తరతరాలుగా వస్తున్న శతాబ్దాల సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి పాటించకపోవడం హిందువులను అవమానించడమేనని మండిపడింది.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 16 లలో రాములవారికి అధికారికంగా ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ భద్రాచలం వైపు ముఖం చూపకపోవడం పట్ల పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి విస్మయం వ్యక్తం చేశారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీ సీతారామ చంద్రుల వారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతోందని, ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుందని వారు తెలిపారు.  ఇంతటి ప్రాశస్తం గల కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం దుర్మార్గమని వారు విమర్శించారు.
 
17వ శతాబ్దంలో తానిషా  ప్రవేశపెట్టిన సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాములవారికి సమర్పించకుండా హిందూ సమాజాన్ని కెసిఆర్ అవమానిస్తున్నారని వారు దుయ్యబట్టారు.
 
శతాబ్దాల పరంపరలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న, ఎవరు రాజుగా ఉన్న వాళ్లు అధికారిక హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ సంప్రదాయాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. మరి ముఖ్యంగా ఈ పుష్కర సామ్రాజ్య మహోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన పోవడం రాములవారిని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
విశ్వహిందూ పరిషత్, రాముల వారి భక్తుల ఆగ్రహానికి గురికాకుండా తూతూ మంత్రంగా మార్చి 29న కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. 30న కళ్యాణం ఉంటే 29న డబ్బులు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. కళ్యాణ మహోత్సవానికి రూ. 2.25 కోట్లు ఖర్చు అవుతాయని ఆలయ అధికారులు ఫిబ్రవరిలోనే సీఎంఓ కు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా అంటూ ఇతర మతస్తులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ  హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు కూడా లక్ష రూపాయలు కేటాయించలేని దౌర్భాగ్యస్థితి రాష్ట్రంలో నెలకొనడం పట్ల వారు  ఆవేదన వ్యక్తం చేశారు.  2016లో ఇచ్చిన హామీ మేరకు భద్రాద్రి రామయ్యకు రూ. 100 కోట్ల  కేటాయింపు ఎప్పుడు చేస్తారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాములవారి మందిరంలో నిత్యం అయ్యే ఖర్చుల వివరాల కోసం కూడా హుండీపై ఆధారపడే దుస్థితి ఏర్పడిందని వారు విచారం వ్యక్తం చేశారు.