దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీకైనట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ మేరకు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు డేటా చౌర్యం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంతో పాటు బ్యాంకు, పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వ్యక్తిగత వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్న క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జస్ట్ డయల్ ద్వారా సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు ఏజెన్సీల నుంచి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, మెయిల్ ఐడీ వంటి వివరాలు సేకరిస్తున్న ముఠా అంగట్లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. రుణాలు ఇచ్చే సంస్థలు ఈ డేటాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై కేసు దర్యాప్తు కోసం ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. డేటా చౌర్యం కుంభకోణంలో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ప్రమేయం ఉన్నట్లు తేలిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని వెల్లడించారు.
రక్షణ రంగానికి చెందిన అధికారుల ఫోన్ నెంబర్లు, వాళ్లు పనిచేసే ప్రాంతం, మెయిల్ ఐడీలు వంటి కీలక సమాచారం కూడా అమ్మకానికి పెట్టడంతో ఆర్మీ ఉన్నతాధికారులు సైతం సైబరాబాద్ పోలీసులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా డేటా చౌర్యం జరిగినట్లు తేలడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈడీ అధికారులు సైతం నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం