పేపర్ లీక్ కేసులో ఈడీ రంగప్రవేశం?

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కీలక నిందితుడని అంటి బిజెపి, కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండగా, ఈ కేసుపై  డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. పేపర్ కొనుగోలులో ఆర్ధిక వ్యవహారాలు చోటుచేసుకోవడం, భారీగా ముడుపులు చేతులు మారడంతో ఈడీ రంగంలోకి దిగింది.
 
డబ్బులన్నీ హవాలా మార్గంలో జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.  సిట్ దర్యాప్తు జరిపిన పత్రాలను కోర్టు నుంచి తీసుకునే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న  నిందితులను విచారిస్తే హవాలా లావాదేవీల గురించి  బయటపడే అవకాశం ఉంది. ఈ కేసులో జరిగిన డబ్బు లావాదేవీల గుట్టు తేల్చేందుకు ఈడీ కసరత్తు చేయగలదని భావిస్తున్నారు.
 
నిందితుల మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించడంతో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీని ఆధారంగా ఈడీ కూడా త్వరలో కేసు నమోదు చేసి నగదు లావాదేవీలపై విచారణ చేపట్టనుంది.
 
ప్రశ్నాపత్రాల విక్రయం ద్వారా లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ పోలీసుల విచారణలో తేలింది. ఒక్కొ పేపర్‌కు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నట్లు గుర్తించారు.  దీంతో లావాదేవీలపై వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
 
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యతో పాటు ఇతర నిందితులు లక్షల్లో డబ్బులు తీసుకున్నట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏఈ క్వశ్చన్ పేపర్ కోసం ఏకంగా రూ.25 లక్షలు చేతులు మారినట్లు తేలింది. అయితే ఈ కేసులో ఈడీ మరో కొత్త కోణంపై దృష్టి పెట్టింది. హవాలా మార్గంలో నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో పీఎంఎల్ఏ చట్టం క్రింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుందని చెబుతున్నారు. త్వరలోనే సిట్ అధికారుల నుంచి ఈ కేసు వివరాలను ఈడీ కోరే అవకాశముంది. అలాగే ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించడంతో పాటు నిందితులను ప్రశ్నించే అవకాశముంది.  కేవలం డబ్బుల వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఈడీ దర్యాప్తు చేపడుతుంది. నిందితులకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా బదిలీ చేశారు? అనే వివరాలను సేకరించనుంది. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని సిట్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. మరిన్ని వివరాల కోసం వారిని ఆరా తీస్తోంది.

 
మరోవంక, ఈ కేసులో ప్రధాన నిందితుడు మంత్రి కేటీఆర్ అని బిజెపి, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ పై కూడా దర్యాప్తు జరపాలని, సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలలో పనిచేసే సిట్ దర్యాప్తు పట్ల తమకు నమ్మకం లేదంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలని కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈడీ దర్యాప్తు పట్ల దృష్టి సారించడం ఆసక్తి కలిగిస్తోంది.