కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

పాకిస్థాన్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కరాచీలో ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ మాజీ డైరెక్టర్‌, కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌ బీర్బల్‌ జెనాని తన అసిస్టెంట్‌ డాక్టర్‌తో కలిసి కరాచీలోని రామ్‌స్వామీ నుంచి గుల్షన్‌-ఈ-ఇక్బాల్‌ ప్రాతానికి కారులో వస్తున్నారు.
 
ఈ క్రమంలో లయారీ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద కారును అడ్డగించిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో బీర్బల్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన సహాయకురాలైన మహిళా డాక్టర్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డాక్టర్‌ను దవాఖానకు తరలించారు.
 
డాక్టర్‌నే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నదని పోలీస్‌ అధికారి ఆరీఫ్‌ అజీజ్‌ చెప్పారు. దుండగులను గుర్తించేందుకు సీసీ టివీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కాగా, గత వారం దేశంలోని హిందూ వ్యాపారులను వెధించారు. వారు రంజాన్‌ ఆర్డినెన్స్‌ను అతిక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా తింటున్నారని పోలీసులు పలువురు వ్యాపారులపై దాడులకు పాల్పడ్డారు.
 
దేశ ద్రోహ చట్టం రద్దు

ఇలా  ఉండగా, పాకిస్థాన్‌లోని లాహోర్‌ హైకోర్టు గురువారం వలస పాలకుల కాలం నాటి దేశ ద్రోహ చట్టాన్ని కొట్టేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ షాహిద్‌ కరీం దేశ ద్రోహానికి సంబంధించిన పాక్‌ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 124-ఎను కొట్టేశారు.

దేశద్రోహ చట్టం స్వతంత్ర పాకిస్థాన్‌లో భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ఆయుధంగా తయారైందని ఓ పౌరుడు పిటిషన్‌ వేయడంతో కోర్టు విచారణ జరిపి ఈ నిర్ణయం వెలువరించింది.