కర్ణాటకలో మరోసారి బీజేపీదే అధికారం

కర్ణాటకలో తప్పకుండా మరోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ కర్ణాటక ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ న్యూస్ 18 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023’లో పాల్గొని కర్ణాటక ఎన్నికలపై మాట్లాడారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీసుకొచ్చిన రిజర్వేషన్ పాలసీని ప్రజలు స్వాగతించారని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే కాంగ్రెస్ ఆందోళన చేస్తోందని విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారత్ లో రిజర్వేషన్లు కాస్త భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు.

మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదకనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టత ఇచ్చారు. ఈ రిజర్వేషన్ విధానంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆయన దుమ్మెత్తి పోశారు.

రైజింగ్ ఇండియా సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి మేనియా ప్రతి రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.  ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మోదీ ప్రభావం ఎలాంటిదో రుజువైందని తెలిపారు. ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మే 10న ఒకే విడతలో 224 స్థానాలకు పోలింగ్‌ని నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మే 13న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టలేదు. దీంతో ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రను తిరగరాయాలని బీజేపీ పట్టుదలతో ఉంది.

రాహుల్ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు గుప్పించారు. ఓబీసీలపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇలా ఓబీసీ వర్గాన్ని కించపరచడం రాహుల్‌కి ఇదేమీ తొలిసారి కాదని ఆయన చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సఫలం కాలేదని తెలిపారు. అందుకే కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు.

నూతన విద్యావిధానం

కాగా, నూతన విద్యావిధానం గురించి ఎటువంటి విబేధాలు లేవని, దేశంలో ఎవ్వరూ దానిని వ్యతిరేకించడం లేదని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అయితే నాలుగైదు రాష్ట్రాలకు దానిపై కొన్ని రాజకీయ విబేధాలు ఉన్నాయని చెప్పారు. నూతన విద్యావిధానం ద్వారా చరిత్రను సరిదిద్దుతామని తానెప్పుడూ చెప్పలేదని తెలిపారు.
 
ఏ రాష్ట్రం కూడా దానిని పూర్తిగా అమలు పరచం అని చెప్పడం లేదని ఆయన గుర్తు చేశారు. అయితే హిందీ వంటి అంశాలపై కొందరికి విబేధాలు ఉన్నాయని చెప్పారు. కాగా, భారతీయ భాషలు అన్ని జాతీయ భాషలే అని చెప్పిన మొదటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని ఆయన గుర్తు చేశారు.
గత 75 ఏళ్లుగా భాషా అంశాన్ని దేశంలో వివాదాస్పదం కావించామని చెబుతూ విద్యార్థుల ఎదుగుదలకు భాష సహకారి అని నూతన విద్యావిధానం చెబుతోందని ఆయన పేర్కొన్నారు. నేడు మనమంతా `నాటు నాటు …’ పాట విశేష ప్రజాదరణ పొందుతున్నదని చెబుతూ అయితే మనలో చాలామందికి ఆ పాటలో అర్థం తెలియదని చెప్పారు.