అవినీతి పరులను కాపాడటమే విపక్షాల ప్రధాన లక్ష్యం

విపక్షాలు అవినీతి పరులతో నిండిపోయాయని, అవినీతి పరులను కాపాడుకోవడమే వాటికి ప్రధాన లక్ష్యంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే వారంతా ఒక్కటవుతున్నారని పేర్కొన్నారు. అవినీతి పరులను కాపాడడానికి మాత్రమే విపక్షాలు ఉద్యమాలు చేస్తాయని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో బీజేపీ ఆడిటోరియం, నివాస సముదాయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిపరులను కాపాడడం కోసం విపక్షాలు ‘బ్రష్టాచారి బచావో ఆందోళన్’ ను ప్రారంభించాయనివిమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా భారత్ లోని లోని, భారత్ వెలుపల ఉన్న దేశ వ్యతిరేక శక్తులు కలిసిపోతున్నాయని ఆయన హెచ్చరించారు.

అయితే, భారత్ లోని రాజ్యాంగసంస్థలు సుధృడమైనవని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, అవినీతిపై అవి కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, అందువల్లనే వాటిపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.

ఏడు దశాబ్దాల్లో తొలిసారిగా ఎన్నడూ లేనంతగా అవినీతిపై పోరాడుతుంటే కొందరికి (ప్రతిపక్షాలకు) కోపం వస్తోందని, అందుకే వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.‘‘అవినీతిపరులపై చర్యలు తీసుకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు. కోర్టులు తీర్పులు ఇస్తే, కోర్టులను లక్ష్యంగా చేసుకుంటారు. అవినీతిపరులను కాపాడడమే వారి లక్ ష్యం’’ అని ప్రధాని తెలిపారు.

అయితే, తాను ఎక్కడికి వెళ్లినప్పటికీ అవినీతిపై పోరాటాన్ని కోనసాగించమని తనకు ప్రజల నుంచి అభ్యర్థన వస్తోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.  కొందరైతే కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను లూటీ చేశారని మోదీ ఆరోపించారు. బ్యాంకులు లూటీ చేసి వెళ్లిన వారి ఆస్తుల్లోంచి రూ. 20 వేల కోట్లు జప్తు చేసినట్లు మోదీ చెప్పారు.

ఈశాన్య రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో విజయాలు సాధించడంపై బీజేపీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు రెండు లోక్‌సభ సీట్లు కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ నేడు 303 స్థానాలు దక్కించుకుందని మోదీ చెప్పారు.

‘‘1984లో ఏం జరిగిందో భారత్ ఎన్నటికీ మర్చిపోదు. అదొక చీకటి కాలం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయినా, మనం కుంగిపోలేదు. ఎవరినీ నిందించలేదు. ఎవరిపై దాడులు చేయలేదు. ప్రజల్లోకి వెళ్లాం. ప్రజా సమస్యలపై పోరాడాం. ప్రజల నుంచి మద్దతు సాధించాం. పార్టీగా బలోపేతం అయ్యాం. 2 లోక్ సభ స్థానాల నుంచి 2019 లో 303 స్థానాలు గెలుచుకునే స్థాయికి ఎదిగాం. చాలా రాష్ట్రాల్లో బీజేపీ 50 శాతంకు పైగా ఓట్లు సాధించింది’’ అని మోదీ వివరించారు.

తూర్పు నుంచి పశ్చిమం వరకూ, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ బీజేపీ విస్తరించిందని పేర్కొన్నారు. అటు ఈశాన్య రాష్ట్రాల్,  ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. అయితే, బీజేపీ టీవీలు, పేపర్లు, ట్విటర్, యూ ట్యూబ్ ఛానెళ్ల ద్వారా పుట్టుకొచ్చింది కాదని, కార్యకర్తల కృషి వల్లే అభివృద్ధి చెందిందని ప్రధాని స్పష్టం చేశారు.

‘కర్నాటకలో మనమే నెంబర్ 1. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల్లో ప్రజాదరణను గణనీయంగా పెంచుకుంటున్నాం. ఆ రాష్ట్రాల్లో బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది’ అని ప్రధాని తెలిపారు. తమిళనాడు, కేరళల్లో బీజేపీ బూత్ స్థాయికి విస్తరించిందని చెప్పారు.  ఇప్పుడు దేశవ్యాప్తంగా కుటుంబ పాలన కొనసాగిస్తున్న పార్టీలే ఉన్నాయని మోదీ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబ పార్టీల మధ్య ఒక్క బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే బీజేపీ ఇప్పుడు అతి పెద్ద పార్టీ అని గుర్తు చేశారు.