అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆదివారం కర్ణాటకలోని బీదర్ జిల్లా బస్వకళ్యాణ్ తాలూకా గోరట గ్రామంలో జరిగిన బహిరంగసభలో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రత్యేకంగా అమిత్ షా ప్రస్తావించారు.

గోరట గ్రామంలో 1948 మే తొమ్మిదో తేదీన రజాకార్ల ఊచ కోత, వాళ్లతో పోరాడిన యోధుల గురించి ప్రస్తావిస్తూ, యావత్ దేశం స్వేచ్చా వాయువులు పీలుస్తుంటే హైదరాబాద్ రాష్ట్రం క్రూర నిజాం చేతిలో బందీగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం గతేడాది అద్భుతంగా నిర్వహించినట్లు అమిత్ షా చెప్పారు. ఈ ఏడాది కూడా తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.

ఓటు బ్యాంకు కోసం దురాశతో కాంగ్రెస్ ఎన్నడూ స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకునే కార్యక్రమాలను నిర్వహించలేదని విమర్శించారు.  అదేవిధంగా హైదరాబాద్ విముక్తి దినోత్సవాలను కూడా నిర్వహించలేదని చెప్పారు. 

హైదరాబాద్ విముక్తి, స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారని అమిత్ షా చెప్పారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదని స్పష్టం చేశారు. బీదర్‌కు కూడా స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు.  హైదరాబాద్ నుంచి నిజాం పాలకుడిని తప్పించడంలో మన దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ పోషించిన పాత్రకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన పోషించిన పాత్ర వల్లే బీదర్ భారత దేశంలో అంతర్భాగం అయిందని చెప్పారు.

గరోటా గ్రామస్థుల త్యాగాలను ఈ సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి ప్రశంసించారు. 2.5 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు క్రూరుడైన నిజామ్ సైన్యం గరోటా గ్రామస్థులను హత్య చేసిందని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో ఆ అమర వీరుల స్మారకాన్ని నిర్మించామని గుర్తు చేశారు.

కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు వందలాది మందిని హత్య చేశారని పేర్కొంటూ అదే గడ్డపైన మనం 103 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని అమిత్ షా చెప్పారు. ఇది ఎవరి దృష్టినీ తప్పించుకోదని స్పష్టం చేశారు. అంతకుముందు గోరట గ్రామంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు

కాగా, ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించడాన్ని అమిత్ షా సమర్ధించారు. మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన భారత రాజ్యాంగంలో లేదని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. మైనారిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం కల్పిస్తున్నవి కాదని తేల్చి చెప్పారు.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పోలరైజేషన్ పాలిటిక్స్ కోసం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందని, ఆ కోటాను వొక్కళిగలకు, లింగాయత్‌లకు ఇచ్చిందని ఆయన చెప్పారు.