భారత పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న నారీశక్తి

భారత పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతూ నారీ శక్తి ప్రబలంగా పుంజుకుందని సంతోషం వ్యక్తం చేశారు. నాగాల్యాండ్‌లో 75 ఏళ్లలో తొలిసారి ఇద్దరు మహిళలు శాసన సభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఆదివారం నిర్వహించిన 99 వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ త్రివిధ దళాలతోపాటు వివిధ రంగాల్లో నారీశక్తి చాటుతోన్న సత్తాను ప్రధాని కొనియాడారు.
 
ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందిన సురేఖ యాదవ్, ఆస్కార్ గెలుచుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్‌మోంగా, దర్శకురాలు కార్తికి గోంజాల్వేస్ తదితరుల ఉదాహరణలను ప్రస్తావించారు. అంతేకాదు, యూఎన్ మిషన్ కింద పీస్ కీపింగ్ కోసం కేవలం మహిళా ప్లటూన్‌నూ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రూప్ కెప్టెన్ శైలిజా ధామి కంబాట్ యూనిట్‌లో కమాండ్ అపాయింట్‌మెంట్ పొందిన తొలి మహిళా వైమానిక దళ అధికారిణిగా రికార్డు సృష్టించారని వివరించారు.

దేశంలో అవయవ దానంపై అవగాహన పెరుగుతుండటం సంతృప్తికర విషయమని ప్రధాని మోదీ చెప్పారు. అవయవ దానానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ వాసులకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు.

పుట్టిన 39 రోజులకే కన్నుమూసిన తమ కుమార్తె అవయవాలను దానం చేసిన అమృత్‌సర్‌కు చెందిన దంపతులతో మాట్లాడారు. ఇలాంటి దాతలు జీవితం విలువను అర్థం చేసుకుంటారంటూ అభినందించారు. 2013లో మన దేశంలో అవయవదానం 5,000 సార్లు జరిగిందని, అదే 2022లో ఈ సంఖ్య 15,000కు పెరిగిందని ప్రధాని వివరించారు.

కాగా, ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం పైన ప్రజలను అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  సౌరశక్తి వంటి క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ పాత్ర పెరుగుతోందని చెబుతూ పగటిపూట అవసరాలకు కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించే దేశంలోనే మొదటి జిల్లాగా దియూ నిలిచిందని తెలిపారు. .

వారణాసిలో కాశీతమిళ సంగమం కార్యక్రమం ద్వారా రెండు ప్రాంతాల ప్రజల మధ్య పురాతన సంబంధాలను ఉత్సవంగా నిర్వహించినట్టు చెప్పారు. ఏక్ భారత్‌శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెలలో 100 వ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రజలు తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు.

వారణాసిలో కాశీతమిళ సంగమం కార్యక్రమం ద్వారా రెండు ప్రాంతాల ప్రజల మధ్య పురాతన సంబంధాలను ఉత్సవంగా నిర్వహించినట్టు చెప్పారు. ఏక్ భారత్‌శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2014 అక్టోబర్ 3 విజయదశమి రోజున ప్రారంభించిన ఆకాశవాణిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం 100వ కార్యక్రమం ఏప్రిల్ 30న ప్రసారం అవుతుందని చెబుతూ ఈ కార్యక్రమానికి ప్రజల సూచనలు తెలుసుకోవడం పట్ల తాను ఆసక్తితో ఉన్నట్లు ప్రధాని చెప్పారు.