సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా

దేశంలో అతిపెద్ద సైబర్‌ స్కామ్ ‌ను సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. 16 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయించినట్లు గుర్తించారు. దీంట్లో ప్రముఖంగా మహిళల డేటా కూడా చోరీకి గురైందని గుర్తించారు.
 
ఈ కేసు విచారణలో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.  ఈ కేసు విచారణలో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.  నాగపూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ముఠా సభ్యులు దేశంలోని కోట్లమంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
 
హైదరాబాద్‌ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. 
 
నిందితులు పబ్లిక్ కు ఫోన్ చేసి బిల్ పే చేయలేదని, ఆప్ డేట్ చేయాలని ఫోన్లు, మెసేజ్ లు చేస్తుంటారని గుర్తించారు.  వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని రవీంద్ర వెల్లడించారు. అంతేకాదు.. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా సైతం చోరీకి గురైందని తేల్చారు.
 
ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు చోరీ చేసినట్లు గుర్తించారు. దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లకు నిందితులు అమ్మకానికి పెట్టారని గుర్తించారు. ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన డేటా కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. అంతేకాదు ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారు.
 
“దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను అపహరిస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్‌ మీడియా ఐడీలు, పాస్‌వర్డ్‌లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది” అని రవీంద్ర తెలిపారు.
 
“కేటుగాళ్లు ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌కార్డులు, లోన్‌ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్‌ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్‌ చేశాం” అని సీపీ వివరించారు.