ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ

ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఓట్ల క్రాస్ వెరిఫికేషన్పై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బగా అభివర్ణించారు. 

ఈవీఎంలపై అపనమ్మకం సృష్టించినందుకు ప్రతిపక్షాలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం బిహార్లోని ఆరారియాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. తమ అభిమాన ఓటు బ్యాంకు కోసం (మైనార్టీలను ఉద్దేశించి) ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇచ్చిన రిజర్వేషన్లను దోచుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. 

‘కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు బూత్ క్యాప్చర్ ద్వారా పేదలు, వెనుకబడిన, దళితుల ఓట్లను తొలగించేవారు. ఈవీఎంలను ప్రవేశపెట్టడం వల్ల ఎవరూ ఓట్లను కోల్పోలేదు. అందుకే ఈవీఎంలపై ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి’ అని  ప్రధాని ఆరోపించారు. 

`కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు బదిలీ చేసింది. తన మిత్రపక్షం ఇలా చేస్తే బిహార్ కు చెందిన ఆర్జేడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు బిహార్ సహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మైనార్టీలకు ఇచ్చేందుకు కుట్ర చేస్తోంది. నేను ఓబీసీని. అందుకే నాకు వెనుకబడిన తరగతుల వారు పడుతున్న కష్టాలు తెలుసు’ అని ప్రధాని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్ల కోసం అంగీకారం తెలిపిందని మోదీ ఈ సందర్భంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ పార్టీ హిందువుకు చేస్తున్న అన్యాయం మరోసారి బట్టబయలైందని ప్రధాని మోదీ విమర్శించారు. అమెరికాలో వారసత్వ పన్నుపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై సైతం మోదీ స్పందించారు. ప్రజల ఆస్తిని తమ పిల్లలకు అప్పగించాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని ధ్వజమెత్తారు.

రెండో దశలో ఎన్డీయేకు అపూర్వ మద్దతు

రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే రీడు దశ చాలా బాగుందని, ఈ సారి కూడా ఎన్డీయేకు కలిసి వచ్చిమదని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.

 ”ఫేజ్-2 కూడా చాలా బాగుంది. ఓటు వేసిన దేశప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్డీయేకు లభించిన అసాధారణ మద్దతు విపక్షాలకు మరింత నిరాశకు గురిచేస్తుంది. ఎన్డీయే సుపరిపాలనను ఓటర్లు కోరుకుంటున్నారు. యువకులు, మహిళా ఓటర్లు బలమైన ఎన్డీయే మద్దతును బలపరుస్తున్నారు” అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.