అధికారులను యాపిల్‌ ఐఫోన్లను వాడొద్దన్న రష్యా

రష్యా – ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో అధికారులను యాపిల్‌ ఐఫోన్లను వాడొద్దని రష్యా ప్రభుత్వం కోరింది. నిఘా వ్యవస్థ ద్వారా రష్యా ప్రభుత్వ చర్యలను అమెరికా, బ్రిటన్‌ దేశాలు ముందే పసిగట్టడాన్ని గ్రహించిన రష్యా ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు కొమ్మర్సంట్‌ అనే దినపత్రిక నివేదించింది.

తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన సెమినార్‌లో ప్రెసిడెన్షియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిప్యూటీ హెడ్‌ సెర్గీ కిరియెంకో మాట్లాడుతూ  ‘దేశ రాజకీయాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న అధికారులు ప్రస్తుతం వారు ఉపయోగిస్తున్న ఐఫోన్లను వాడొద్దు. ఏప్రిల్‌ 1 నాటికి మీరు వాడే ఐఫోన్లన మార్చుకోండి.’ అని ఆయన అధికారులను కోరినట్లు కొమ్మర్సంట్‌ పత్రిక తెలిపింది.

అలాగే ‘మీరు వాడే ఐఫోన్ల పని అయిపోయింది. వాటిని విసిరేయడమో లేదా.. ఆడుకునేందుకు పిల్లలకు ఇవ్వడమో చేయండి. అందరూ మార్చినెల లోపే మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని సెమినార్‌లో సెర్గీ సూచించినట్లు కొమ్మర్సంట్‌ తెలిపింది.

ఇక ప్రత్యేకించి అధికారులకు ఐఫోన్స్‌ బదులు డిఫరెంట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో పరికరాలను అందించేలా క్రెమ్లిన్‌ సెమినార్‌లో నిర్ణయం తీసుకున్నట్లు కొమ్మర్సంట్‌ వెల్లడించింది. అయితే ఈ నివేదికపై ప్రెస్‌ కార్యదర్శి పెస్కోవ్‌ మాట్లాడుతూ  ‘కొమ్మర్సంట్‌ నివేదికను తాను ధృవీకరించలేనని పేర్కొన్నారు. అయితే అధికారిక ప్రయోజనాల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించలేమని ఆయన చెప్పారు.

ఇక హెడ్‌సెర్గీ వ్యాఖ్యలకు యాపిల్‌ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, గత సంవత్సరం రష్యా తన దళాలను ఉక్రెయిన్‌లోకి పంపిన కొద్దిసేపటికే పుతిన్‌ దాడి చేయాలని యోచిస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌ నిఝా వర్గాలు బహిర్గతం చేశాయి. ఈ నేపథ్యంలోనే రష్యా అధికారులను ఐఫోన్లను ఉపయోగించొద్దని ప్రభుత్వం కోరుతోంది.