లండన్‌లో భారత జాతీయ జెండాను అగౌరవపరిచిన ఖలిస్థానీవాదులు

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేయడంపై గత రెండు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమృత్‌పాల్‌ కోసం పోలీసుల గాలింపును నిరసిస్తూ అతని మద్దతు దారులు ఆందోళన చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్‌లో నిరసనలు ప్రారంభించింది. లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయం వద్ద ఖలిస్థాన్‌ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఖలిస్థాన్ జెండాలతో పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు అగౌరవ పరిచారు.
 
లండన్‌లోని భారత్‌ హైకమిషన్ భవనంపై రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను కిందకి లాగేశారు. గమనించిన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని జాతీయ జెండాను వారి నుంచి లాక్కున్నారు. ఖలిస్థాన్ జెండాను ఎగరవేసే ప్రయత్నాలను అడ్డుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని కిందికి దించివేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి.
 
ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే భారత హైకమిషన్ ఖలిస్థాన్ మద్దతుదారులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. హైకమిషన్ భవనంపై భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసింది. మరోవంక, ఈ సంఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ పేర్కొంది. దీనికి బాధ్యులైనవారిపై వెంటనే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ చర్యను తీవ్రమైనదిగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్‌ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది. వియన్నా ఒప్పందం ప్రకారం భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని భారత విదేశాంగశాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది.