
“పాకిస్థాన్తో మేమెప్పుడూ వాణిజ్యాన్ని ఆపేయలేదు, కాకపోతే పాకిస్థానే భారత్తో తన వాణిజ్యాని ఆపింది. సమస్యలను, పరిస్థితులను ఎలా మార్చగలమనేది మనం ఆలోచించాల్సి ఉంది” అని పాకిస్థాన్లోని భారత డిప్యూటీ హైకమిషనర్ డా. ఎం సురేశ్ కుమార్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఇప్పటికీ వాణిజ్యం జరుగుతున్నప్పటికీ అది చాలా తక్కువని చెప్పారు.
లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎల్సిసిఐ)లో మాట్లాడుతూ పాకిస్థాన్తో భారత్ ఎప్పుడూ మంచి సంబంధాలనే కోరుకుందని, ఎందుకంటే మనము భౌగోలిక పరిస్థితులను మార్చలేమని చెప్పారు. ఎప్పటికి పొరుగు దేశాలుగానే ఉండవలసిన అవసరం ఉన్నదని, అందుకనే సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగేలా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
నేటి దౌత్యం పర్యాటకం, వాణిజ్యం, సాంకేతికతలపై దృష్టి పెట్టాల్సి ఉందని పూర్వపు రాజకీయాల చుట్టూ తిరిగే దౌత్య విధానాలు పోయాయని, నేడు దౌత్యం పర్యాటకం, వాణిజ్యం, టెక్నాలజీ చుట్లూ తిరుగుతున్నాయని, నేడు డబ్బే తన భాష మాట్లాడుతోందని ఆయన తెలిపారు. మధ్య ఆసియా మార్కెట్ కు చేరుకోవడానికి భారత్ కు, మధ్య ఆసియా దేశాలకు పాకిస్తాన్ మార్గం చాలా ముఖ్యమైనదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
పాకిస్థాన్ భారత్తో 2019లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను తెంచేసుకుంది. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ తొలగించేశాక పాకిస్థానే ఇస్లామాబాద్లోని భారత హై కమిషనర్ను బహిష్కరించింది. పొరుగు దేశమైన పాకిస్థాన్తో సాధారణ సంబంధాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంది. కానీ పాకిస్థానే భారత్లో ఉగ్రవాద సమస్యలు సృష్టిస్తూ వచ్చింది.
2019-20లో పాకిస్థాన్తో భారత్ వాణిజ్యం 830.58 మిలియన్ డాలర్లు ఉండగా, 202021లో అది 329.26 మిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని డేటా తెలుపుతోంది. దీనికి కారణం కూడా పాకిస్థానే. కరోనా మహమ్మారి కాలంలో పాకిస్థానీలకు జారీ చేసిన వీసాలు తక్కువేనని భారత హైకమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు.
అయితే ఇప్పుడు పాకిస్థానీలకు ప్రతి ఏడాది 30,000 వరకు వీసాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇది పెద్ద సంఖ్య అనే చెప్పాలని పేర్కొన్నారు. పాకిస్థానీలకు భారత ప్రభుత్వం మెడికల్, స్పోర్ట్ వీసాలను కూడా జారీ చేస్తోందని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ వీసాలను ఎవ్వరికీ తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్, చైనాతో 120 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని కలిగి ఉంది. చైనాతో భారత్ వాణిజ్యం సమతుల్యంగానే ఉంది.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతూ ప్రస్తుతం సేవల రంగంలో చాలా ముందంజలో ఉన్నామని, ఇప్పుడు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగాలపై దృష్టి సారిస్తున్నామని వివరించారు.
లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎల్సిసిఐ) అధ్యక్షుడు కషీఫ్ అన్వర్ మాట్లాడుతూ భారత, పాకిస్థాన్ మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపరచడం చాలా క్లిష్టమైన అంశం అని తాను భావించానని చెప్పారు. దానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని భావించానని తెలిపారు. ‘ప్రస్తుతం పాకిస్థాన్, భారత్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తోంది. ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చనుంది’ అని ఆయన తెలిపారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ