లీకేజీకి కేటీఆర్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ అభిప్రాయపడింది. దీనికి బాధ్యతగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, అందులో భాగంగా కమిషన్ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించాలని కోరింది.
 
గ్రూప్-1, ఏఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చిన టాస్క్ ఫోర్స్ కమిటీ మిగిలిన ప్రశ్నా పత్రాల లీకేజీ, రాబోయే 3 నెలల్లో జరగబోయే ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
 
 పరీక్షల రద్దుతో కోచింగ్, హాస్టల్ వసతి పేరుతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్న నేపథ్యంలో వారందరికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. దీంతోపాటు గతంలో ప్రకటించిన షెడ్యూల్ లోపే ఆయా పరీక్షలన్నీ నిర్వహించి ఉద్యోగ నియమకాల భర్తీని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. 
 
 బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన  టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమై పబ్లిక్ సర్వీస్ రెగ్యులేషన్ ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అంతా ఛైర్మన్ పరిధిలోనే ఉండాలని గుర్తు చేసింది. నిపుణుల ద్వారా పేపర్ సెట్టింగ్, సెక్యూరిటీ ప్రింటింగ్ ద్వారా పేపర్ ప్రింటింగ్ సహా వాటిని సంబంధిత కేంద్రాలకు చేరే వరకు పూర్తి బాధ్యత ఛైర్మన్ దే అని స్పష్టం చేసింది.
 
కేంద్రం 2011లో చేసిన ఐటీ చట్ట సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే అన్ని శాఖల్లోని ఐటీ విభాగాలు తప్పనిసరిగా కేంద్రం నియమించే థర్డ్ పార్టీ నిర్వహించే సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికెట్ పొంది ఉండాలని, కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల ద్వారా ఐటీ సేవలందిస్తున్న ఏ ఒక్క వెబ్ సైట్ కు కూడా ఆడిట్ సర్టిఫికెట్ లేదనే విషయం సమావేశంలో పలువురు సభ్యులు ప్రస్తావించారు.
 
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీతోపాటు ధరణి స్కాం, జీహెచ్ఎంసీ ఫేక్ సర్టిఫికెట్స్ స్కాం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చెల్లింపుల స్కాం సహా, సెక్యూరిటీ సర్టిఫికేట్ లేని కారణంగా ఇరిగేషన్ శాఖలోని టెండర్ల నిర్వహణలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికంతటికీ ఐటీ శాఖ పరిధిలోని ఉద్దేశపూర్వక లోపాలే కారణమని అంచనాకు వచ్చింది. 
 
రాష్ట్రంలో ఐటీ చట్టం అమలుతోపాటు టీఎస్పీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం న్యాయపోరాటం చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.  అందులో భాగంగా టాస్క్ ఫోర్స్ కమిటీ శనివారం గవర్నర్ డా. తమిళ సై సౌందర రాజన్ ను కలవాలని నిర్ణయించింది.
 
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని, పరీక్షల రద్దు కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గవర్నర్ అందజేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్ణయించింది.