తెలంగాణాలో మరోసారి కరోనా పంజా

కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా తెలంగాణాలో జ్వరాలు, దగ్గు, జలుబుతో బాధపడుతూ అవే లక్షణాలతో కూడిన వైరల్‌ జ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఫ్లూ వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నామన్నా దశలో ప్రజలను మరోసారి ఇన్‌ఫ్లూయోంజా హెచ్‌3, ఎన్‌2 వేరియేంట్‌ వైరస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా సమయంలోనే అనేక మంది ఇబ్బందులు పడ్డారు. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

బుధవారం 54 కరోనా కేసులు నమోదయ్యాయి. 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్ వచ్చింది. 54 కేసుల్లో 40 కేసులు హైదరాబాద్ పరిధిలో వచ్చాయి. మంగళవారం 52 కేసులు నమోదు కాగా 30 కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 1.09గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

సాధారణంగా శీతాకాలంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ.. ఇప్పుడు ఎండాకాలలోనూ కరోనా కేసులు పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లోని పలు ఆసుపత్రుల్లో జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో వైద్యాధికారులు బెంబేలెత్తిపోతున్నారు. గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్‌లో గత వారంలో రోజుకు 600 నుండి 800 కేసులు వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

ముక్కు కారటం, తలనొప్పి, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో రోగులు ఆస్పత్రికి వస్తున్నారని చెప్పారు. గత వారం రోజులుగా వైరల్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ పేర్కొన్నారు. అయితే,  కరోనా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కేసులు మాత్రం రావడం లేదని తెలిపారు. కేసుల సంఖ్య పెరిగితే ఎదుర్కొనేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. 

స్వైన్ ఫ్లూకు సంబంధించిన ట్యాబెట్లు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మెడికల్ షాపులు, ప్రైవేట్ ఆసుపత్రులలోనూ మాత్రలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ ఊపిరితిత్తులకు కూడా సోకుతుందని చెప్పారు. స్వైన్ ఫ్లూ నివారణకు టీకాలు, మాత్రలు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని,  సామాజిక దూరం పాటించాలంటున్నారు.  ఫ్లూ జ్వరాలు పెరుగుతున్నందున ప్రజలు మళ్లీ మాస్క్‌లు ధరించాలని, లేదా తుమ్మినపుడు క్లాత్‌ అడ్డంగా పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లూ జ్వరాలకు గురైన వారు పిల్లలు, వృద్ధులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

హెచ్3ఎన్2, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. చిన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.