20న విచారణకై కవితకు ఈడీ మళ్లీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎంఎల్‌సి కె కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజా సమన్లను జారీచేసింది. మార్చి 20న తమ ఎదుట హాజరు కావాలని ఇడి అధికారులు ఆమెను ఆదేశించారు.  ఈనెల 24న సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. కానీ సుప్రీం విచారణకు ముందే కవిత ఈడీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో వెల్లడించింది.

కాగా.. గురువారం ఇడి ఎదుట హాజరుకావలసి ఉన్న కవిత వ్యక్తిగతంగా హాజరుకాలేదు. ఆమె తరఫున ఆమె న్యాయవాది ఇడి ఎదుట హాజరయ్యారు. తనకు ఇచ్చిన సమన్లలో వ్యక్తిగతంగా హాజరుకావాలని లేకపోవడంతో తన తరఫున లాయర్‌ను పంపించానని కవిత ఇడికి పంపిన లేఖలో తెలియచేశారు. ఇడి కోరిన డాక్యుమెంట్లను పంపించానని, సుప్రీం కోర్టు నిర్ణయం తరువాత విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

 మరోవంక, రామచంద్ర పిళ్లైని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చింది. రామచంద్రపిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కొరింది. ఈమేరకు పిళ్లైకు ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించింది. కవితతో కలిసి విచారించాలి.. అయితే కవిత ఇవాళ విచారణకు హాజరు కాలేదని ఈడీ తెలిపింది. అందర్ని కలిసి విచారిస్తే ఎలా అని స్పెషల్ కోర్టు ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. లిక్కర్ కేసులో కవిత అనుమానితురాలని ఈడీ కోర్టుకు తెలిపింది. కవితను పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ కోర్టును కోరింది. 

ఎంపీ మాగుంటకు ఈడీ మళ్లీ నోటీసులు

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ  మరోసారి నోటీసులిచ్చింది. మార్చి 18న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ గ్రూప్ లో మాగుంట కీలక వ్యక్తిగా భావిస్తూ విచారణకు రావాలని కొరినట్లుగా తెలుస్తోంది. కాగా ఇదే కేసులో  మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన  తీహార్  జైలులో ఉన్నాడు.