పిల్లలకు తల్లితండ్రులే ఆదర్శమూర్తులు

పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శమూర్తులని తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి పిల్లలు అన్ని విషయాలు నేర్చుకుంటారని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం వివేకానంద ఆడిటోరియంలో ఆర్య జనని ఐదో వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.

ధర్మాచరణలో మంచితనంపై సంపూర్ణ విశ్వాసం ఉండాలని చెబుతూ సంకుచిత స్వభావాలు వీడి ఆధ్యాత్మికతకు సంబంధించి మరింత సానుకూల వాతావరణం ఏర్పరచుకోవాలని స్వామి బోధమయానంద ఉద్భోదించారు. ఆర్య జనని కార్యక్రమాల వ్యాప్తి గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరాలని ఆయన సూచించారు.
 
ఆర్యజనని రూపకర్త, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శితికంఠానంద మాట్లాడుతూ పిల్లలకు షరతులు లేని ప్రేమను అందించాలని చెప్పారు. ఆదర్శవంతమైన జీవనం గడిపిన స్వామి వివేకానంద, శ్రీ రామకృష్ణ పరమహంస, బుద్ధుడు, శంకరాచార్య, రమణ మహర్షి వంటి వారి జీవిత గాధలను పిల్లలకు పరిచయం చేయాలని సూచించారు.
 
సత్ సంతానం కోసం గర్భిణులకు ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలని ఆయన చెప్పారు.  ఆర్య జనని వర్క్ షాప్ లకు హాజరు కావడం ద్వారా ఉత్తమ భవిష్యత్ తరాలను అందించవచ్చని అంటూ ప్రార్థనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు.  ముఖ్యఅతిథిగా హాజరైన ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆర్యజనని కార్యక్రమం స్ఫూర్తి రాష్ట్రమంతటా వ్యాపించాలని కోరారు అన్ని మెడికల్ కాలేజీలకు ఆర్య జనని ప్రాధాన్యతను తెలియజేస్తూ లేఖలు వ్రాయగలనని వెల్లడించారు.
 
ఆర్య జనని కార్యదర్శి డాక్టర్ అనుపమ రెడ్డి మాట్లాడుతూ ఆర్య జనని వర్క్ షాప్ ల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.
 తెలంగాణలోని పలు జిల్లాలనుంచి వచ్చిన వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, మేధావులు, ఆర్య జనని తల్లిదండ్రులు ఆర్యజనని బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.